ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు మార్పు గురించి రకరకాల వార్తలు వినబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్న యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు కి అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వచ్చిన ఈ వార్తల విషయంలో విజయసాయి రెడ్డి వర్సెస్ రామ్మోహన్ నాయుడు అన్నట్టుగా ట్విట్టర్ సాక్షిగా ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు మరియు నారా లోకేష్ అదే విధంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు ని టార్గెట్ చేస్తూ…‘కొడుకేమో ‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’. సీనియర్లంతా చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడు.’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
దీంతో ఈయన చేసిన విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. దానికి తాజాగా ఎంపీ రామ్మోహన్ నాయుడు గట్టి కౌంటర్ వేశారు. రామ్మోహన్ నాయుడు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కి స్పందిస్తూ… ‘అల్లుడేమో అవినీతికి తిమ్మరాజు పనికి పోతురాజు.సీనియర్లు అందరూ చేతగానోడి పాలన చూసి ”ఛీ” కొడుతున్నారు. కారు దించేశారనే కక్షతో మమ అప్రూవర్ గా మారి అల్లుడిని కుర్చీ నుండి దించేయాలని కుట్ర మొదలెట్టాడు. ప్రత్యేక హోదా పై చేతులెత్తేశారు,ఉత్తరాంధ్ర రైల్వే జోన్ పట్టాలెక్కించడం చేతకాలేదు.. మూడు ముక్కలాట మొదలెట్టి మూతి ముడుచుకొని కూర్చోవడం తప్ప ఏడాదిలో మామ, అల్లుడి వలన ఏ ప్రాంతానికి ఒరిగింది ఏమి లేదు. ఢిల్లీలో కాళ్లు మొక్కడం, ట్విట్టర్ లో రెచ్చిపోవడం మాని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు విజయసాయిరెడ్డి గారు’అంటూ మండిపడ్డారు.
దీంతో రామ్మోహన్ నాయుడు ఇచ్చిన కౌంటర్ చూసి చాలా మంది టీడీపీ అధ్యక్షుడిగా రామ్మోహన్నాయుడు అయితే కరెక్ట్ అని అభిప్రాయపడుతున్నారు. విజయసాయి రెడ్డికి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నుండి కౌంటర్ ఇచ్చిన వారు ఎవరూ లేరని అంటున్నారు. ట్విట్టర్ లో ట్వీట్ పెడితేనే భయపడిపోతున్నారు అని అన్న నారా లోకేష్ కూడా ఈ స్థాయిలో విజయసాయి రెడ్డి కి కౌంటర్ ఇవ్వలేదని… ఎంపీ రామ్మోహన్ నాయుడు టీడీపీ అధ్యక్షుడిగా కరెక్ట్ అని పార్టీ సానుభూతిపరులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఇదే వాస్తవం అయితే నారా లోకేష్ పొలిటికల్ కెరియర్ పులిస్టాప్ పడిపోతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.