వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 2 ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీలో చాలా చురుగ్గా ఉండే వ్యక్తి. తన మీదకి గాని…. తన పార్టీ మీదకి గాని ఎవరైనా వస్తే వారిపై విమర్శలను ముఖ్యంగా ట్వీట్ల రూపంలోనే చేస్తారు. ట్విట్టర్ ను ఆయన వాడినంతగా ఏ వైసీపీ నాయకుడు వాడలేడు. అంతెందుకు ఆంధ్ర రాష్ట్రంలోనే ఏ రాజకీయ నాయకుడు వాడినంత ఎక్కువగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ ను వాడుతుంటారు. అతని రెండో నాలుకగా అందరూ ట్విట్టర్ ను అభివర్ణిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో విజయసాయిరెడ్డి వేస్తున్న ట్వీట్లు తిరిగి వైసీపీ వారికే నష్టాన్ని కలిగిస్తున్నాయట.
ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఏమిటంటే విజయసాయిరెడ్డి ఎవర్నీ నేరుగా ఏమీ చేయలేక బలహీనంగా ఉన్న నేతలను టార్గెట్ చేసి వారిపై ట్వీట్లు వేసి.. చివరికి వైసిపి పార్టీ రేంజ్ తగ్గించి చేస్తున్నారు అని. వివరాల్లోకి వెళితే గతంలో టిడిపి నుండి బీజేపీ లోకి వస్తున్న నేతలను ‘మిడతల దండు’ అని అన్నారు. దానికి బీజేపీ నేతలు… ‘మా పార్టీ మా ఇష్టం.. మా పార్టీలోకి మిడతల దండు వస్తే మీకేంటి నష్టం.? టీడీపీ నుంచి బీజేపీలోకి వస్తున్న వాళ్ళని మీరు మిడతలంటున్నారు.. మేం మా పార్టీ కోసం పనిచేసే సైనికులుగా వారిని భావిస్తున్నాం..’ అంటూ గుస్సా అయిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఆయన సుజనాచౌదరిని ఉద్దేశించి “నిన్ను టార్గెట్ చేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాలా? ఇలాంటి చౌకబారు శరణార్ధులను మేము అసలు లెక్కచేయం… ముందు నువ్వు తలకిందులుగా తపస్సు చేయి బాబు కోవర్ట్ అనే ముద్ర చెరపుకోవడానికి” అని ట్వీట్ వేశారు. ఇక్కడ ప్రశ్న- అసలు సుజనా చౌదరి ని టార్గెట్ చేయనప్పుడు మళ్లీ ట్వీట్ వేయాల్సిన అవసరం ఏమిటి? ఈ మధ్య కాలంలోనే జగన్ కు మరియు విజయసాయిరెడ్డి సరిగా పడట్లేదు అని వార్తలు వచ్చాయి. జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి మరియు తదితర సన్నిహితులకు ప్రాధాన్యతనివ్వడం చూస్తూనే ఉన్నాం.
ఇక విజయసాయిరెడ్డి వేసిన ట్వీట్ లో నువ్వు ‘బాబు కోవర్ట్’ అని ముద్ర చెరుపుకో అంటే…. అసలు ఆ ముద్ర వేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ ను ఇంకా ‘బాబు బంధువు’గానే చూపుతున్న వైసిపి వారా… లేకపోతే అసలు ఇటువంటి పదాలతో ఏమాత్రం అవసరం లేని, ఉపయోగం లేని సంబంధం లేని టిడిపి వారా? దీంతో ఒక్కసారిగా బిజెపి మరియు జనసేన మద్దతుదారులు అంతా “ఇప్పటికైనా ఎవరు అబద్ధపు ప్రచారాలు మరియు తమ నేతలకు అబద్ధపు ట్యాగ్ లను ఎవరు కావాలని ఇస్తున్నారో అర్థం చేసుకోండి” అంటూ విజయసాయిరెడ్డి తో పాటు వైసీపీని కూడా నిందిస్తున్నారు.
సుజనా చౌదరి .. నిన్ను టార్గెట్ చేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాలా ? నీలాంటి చౌకబారు శరణార్ధులని మేము అసలు లెక్క చేయము. ముందు నీవు తలకిందులుగా తపస్సు చేయ్ . బాబు కోవర్ట్ అనే ముద్ర చెరుపుకోవడానికి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 14, 2020
ఇదిలా ఉంటే కొన్నాళ్లకు అమరావతి భూముల కుంభకోణంలో సుజనా పాత్ర ఇది అంటూ నానా యాగీ చేసినా వైసిపి తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇక ఇప్పుడు విష్ణువర్ధన్రెడ్డినో, జీవీఎల్ నరసింహారావునో, బీజేపీ ఏపీ ఇన్ఛార్జి సునీల్ దేవ్ధర్నో విమర్శించేంత ‘ధైర్యం’ లేకనే, సుజనా చౌదరిపైనా, కన్నా లక్ష్మినారాయణపైనా సెటైర్లు వేస్తూ విజయసాయిరెడ్డి టైమ్ పాస్ చేస్తున్నారనుకోవాలి. ఇప్పుడు సుజనా చౌదరిపై విమర్శలు చేయడమంటూ ‘లాలూచీ’ రాజకీయాలకు నిదర్శనంగా చెప్పుకోవాలేమో.!
ఇక ఇలాంటి సమయంలో బిజెపి వారు దొరికాడు అంటూ విజయసాయిరెడ్డిని ఫుల్ గా విమర్శిస్తుంటే అటు జగన్ తరపు నుండి కూడా సాయిరెడ్డికి తిట్లు తప్పేలా లేవు అని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. లేకపోతే మన సాయి రెడ్డి గారి మాటలు విని అచ్చెన్నాయుడు వ్యవహారంలో చర్యలు తీసుకున్నట్లు, సుజనా చౌదరి వ్యవహారంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘రిస్క్’ చేసేంత సీన్ ఉందా…?