Vijaya Sai Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒకే రోజు ఒక గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్ అందాయి. విజయసాయిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఈడీ కేసులు తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు ఆదేశించడాన్ని విజయసాయి హైకోర్టులో సవాల్ చేశారు. మొదట సీబీఐ కేసులు విచారణ జరపాలని, లేదంటే సీబీఐ, ఈడీ కేసులు రెండింటిని సమాంతరంగా విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని విజయసాయి హైకోర్టును కోరారు. అయితే విజయసాయి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఈడీ కేసులే తొలుత విచారించాలన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. ఇది విజయసాయికి బ్యాడ్ న్యూస్ కాగా, మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే..
పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా విజయసాయి రెడ్డి ఎన్నికయ్యారు. విజయసాయిరెడ్డితో పాటు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది కూడా ఎన్నికైయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్దీపక్ వర్మ ఒక బులెటెన్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. రాజ్యసభ నుండి గతంలో పీఏసీ సభ్యులుగా ఉన్న భూపేందర్ యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్ కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు నామినేషన్లు ఆహ్వానించగా విజయసాయితో పాటు బీజేపీ సభ్యుడు డాక్టర్ సుధాంశు త్రివేది మాత్రమే నామినేషన్ లు దాఖలు చేశారు. దీంతో వీరు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. ఇది విజయసాయికి గుడ్ న్యూస్.