(విజయనగరం నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కరోనా ఉదృతి నేపథ్యంలో విద్యాసంస్థలను పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అనుమతులు ఇవ్వలేదు. కొద్ది రోజుల నుండే 9,10 తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తరగతులు ప్రారంభించి వారం పది రోజులు గడవక ముందే కరోనా భయం వెంటాడుతోంది. తాజాగా విజయనగరం జిల్లా గంట్యాడ ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల క్రితం అంటే గత నెల 30వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షలు నిర్వహించిన విద్యార్థుల్లో 20 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడు జిల్లా విద్యాశాఖ అధికారిణి నాగమణికి తెలియజేశారు.
రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లాలో ట్యూీషన్ టీచర్ నుండి 14 విద్యార్థులకు కరోనా సోకినట్లుగా గుర్తించారు. కరోనా నేపథ్యంలో పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వని కారణంగా చాలా ప్రాంతాల్లో ట్యూషన్ లు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరులో ట్యూషన్ కు వెళ్లిన 14 మంది విద్యార్థులకు ట్యూషన్ టీచర్ వల్ల కరోనా బారిన పడ్డారు. పాఠశాలలకు, కాన్వెంట్ లకు వెళుతున్న పిల్లలకు కరోనా సోకుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.