గతకొన్ని రోజులుగా సరైన రీ కౌంటర్స్ లేకో ఏమో కానీ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చెలరేగిపోతున్నారు! ప్రత్యేకంగా చంద్రబాబు – చినబాబు ద్వయాన్ని మాత్రం ఏకోసానా విడిచిపెట్టకుండా సాగుతుంది సాయిరెడ్డి ట్విట్టర్ ప్రయాణం. కానీ సాయిరెడ్డి ట్వీట్లకు టీడీపీ నుంచి సరైన రీ కౌంటర్స్ పడటం లేదు. సాయి రెడ్డి వంద ట్వీటితే.. టీడీపీ నుంచి ఒకటి రీట్వీటుతున్నారు! ఈ క్రమంలో తాజగా సాయిరెడ్డి “పిట్ట” బీజేపీ ని పొడవడం మొదలుపెట్టింది! కానీ… అక్కడనుంచి స్ట్రాంగ్ కౌంటర్స్ పడిపోయాయి!
“ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నక నక లాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది.. ఇప్పటికే కొన్ని మిడతలు ఆపార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయి.. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలి” అంటూ టీడీపీ నేతలకు చురకలు వేస్తూనే బీజేపీని అలర్ట్ చేసే పనికి పూనుకున్నారు. ఆ విషయం మరోలా అర్ధమయ్యిందో ఏమో కానీ… బీజేపీ నుంచి సాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ పడింది!
విజయసాయి మిడతల ట్వీట్ కు ప్రతిస్పందించిన ఏపీ బీజేపీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్… “కేవలం పసుపు రంగునే కాదు, అన్ని రంగులనూ కాషాయంగా మార్చుకోగల బలం బీజేపీకి ఉంది” అని మొదలుపెట్టి… “ప్రస్తుతం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫేడ్ చేస్తున్న రంగును మీరు కాపాడుకోండి” అంటూ ముగించారు! దీంతో సాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ పడిందన్న కామెంట్లు పడుతున్నాయి.
ఆ సంగతి అలా ఉంచితే… సాయిరెడ్డి బీజేపీకి సదుద్దేశంతో జాగ్రత్తలు చెప్పే పనికి పూనుకుంటే… దాన్ని బీజేపీ నేతలు మరోలా అర్ధం చేసుకున్నారని అంటున్నారు సాయిరెడ్డి ఫ్యాన్స్! ఇక్కడ విచిత్రం ఏమిటంటే… బీజేపీ నేత ప్రస్థావించిన రఘురామకృష్ణంరాజు ఫేడ్ చేస్తున్న రంగుకు… ఫినిషింగ్ టచ్ ఇచ్చేది తామేనన్న విషయం “ఏ రంగునైనా కాషాయంగా మార్చుకోగల బలం ఉంది” అనే మాటలోనే ధ్వనించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు! `