తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి రెండవ సారి కాషాయం (బీజేపీ) గూటికి చేరుతున్నారు. బీజేపీ నుండే రాజకీయ అరంగ్రేటం చేసి బయటకు వచ్చిన విజయశాంతి తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ పదవిలో ఉన్న విజయశాంతి గత కొన్ని నెలలుగా ఆ పార్టీ నేతలపై అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీనితో చాలా కాలంగా ఆమె పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
దుబ్బాక ఉప ఎన్నికలకు ముందే కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి మంతనాలు జరపడంతో రేపో మాపో బీజేపీలో చేరానున్నారు అని అందరూ భావించారు. అయితే ఆ వార్తలను విజయశాంతి ఖండించలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధు యాష్కీ మాత్రం విజయశాంతి పార్టీ పట్ల అసంతృప్తిగా లేరని, కొందరు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పై మాత్రమే అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. మధు యాష్కీ వ్యాఖ్యను ట్విట్టర్ వేదికగా విజయశాంతి సమర్ధించింది. ఈ నేపథ్యంలో నే తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్ విజయశాంతితో చర్చలు జరిపారు. ఆ తరువాత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా విజయశాంతి పార్టీ పార్టీ మారనున్నారు అంటూ వస్తున్నది పుకార్లు మాత్రమే నని చెప్పుకొచ్చారు.
అయితే విజయశాంతి మాత్రం సోషల్ మీడియా వేదికగా నిత్యం టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు గానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో మాదిరిగా తన పేరు కింద పార్టీ పేరు గాని, డిజిగ్నేషన్ (కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్) పేర్కొనడం లేదు. దానికి తోడు వారం రోజుల క్రితం తన సోషల్ మీడియా ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్ ప్రొఫైల్ పేజీ లో గతం నుండి ఉన్న రాహుల్ గాంధీ ఫోటో, కాంగ్రెస్ పార్టీ సింబల్ లను తొలగించారు. ఇటీవల జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా కాషాయం కలర్ మాస్క్ ను ధరించారు. ఈ పరిణామాలతో విజయశాంతి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడం, బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయమని తేలిపోయింది.
కాగా ఆదివారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లతో కలసి విజయశాంతి భేటీ అయ్యారు. అమిత్ షా తో అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం 11 గంటలకు విజయశాంతి బీజేపీ లో చేరుతున్నారని చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పట్ల బీజేపీ నేతలను షా అభినందించారని తెలిపారు. ఇదే దూకుడు కొనసాగించాలని షా సూచించారన్నారు. సినీ రంగం నుండి నేరుగా బీజేపీ ద్వారా రాజకీయ ఆరంగ్రేటం చేసిన విజయశాంతి..ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో బీజేపీని వీడి తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పని చేశారు. అనంతరం పార్టీ ని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. టీఆర్ఎస్ తరపున ఎంపీ గా పోటీ చేసి విజయం సాధించారు. తరువాత పార్టీ లో సరైన గౌరవం గుర్తింపు ఇవ్వడం లేదని అలిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తరువాత నాయకులతో అంతర్గత విభేదాల కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.