తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి నేడు సొంత గూటి (బీజేపీ)కి చేరారు. విజయశాంతి రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందే. 20 ఏళ్ల క్రితం బీజేపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత తెలంగాణ ఉద్యమం కోసం బీజేపీ నుండి బయటకు వచ్చారు. తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ఉద్యమం చేశారు. ఆ నేపథ్యంలోనే కేసీఆర్ ఆహ్వానం మేరకు పార్టీని టీఆరెస్ లో విలీనం చేసి టీఆర్ఎస్ నుండి ఎంపీగా గెలిచారు.
అనంతరం టీఆర్ఎస్ నుండి బయటకు పంపడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్ పర్సన్ పదవి కట్టబెట్టారు. అయితే సమీప భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చే పరిస్థితి లేకపోవడం, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పోసగక పోవడంతో రాష్ట్రంలో అధికార టీఆరెస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయంగా ఎదగడంతో మరల బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలసి భేటీ అయ్యారు. అనంతరం సోమవారం ఉదయం విజయశాంతి 11గంటలకు పార్టీలో చేరుతున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. కండువా కప్పుకోవంలో ట్విస్ట్… ఢిల్లీ కేంద్ర పార్టీ కార్యాలయంలో విజయశాంతి చేరిక కార్యక్రమం ఉదయం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కాలేదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో పార్టీలో జాయిన్ కార్యక్రమం ఏర్పాట్లు జరిగాయి.
అయితే విజయశాంతికి అరుణ్ సింగ్ పార్టీ కప్పడానికి ప్రయత్నించగా ఆమె సున్నితంగా తిరస్కరించారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా చేతుల మీదుగానే పార్టీ కండువా కప్పుకుంటానని తెలిపారు. దీనితో నడ్డా అపాయింట్మెంట్ తీసుకోని సోమవారం రాత్రి ఆయన నివాసంలో కలిసి ఆయనతో పార్టీ కండువా కప్పించుకున్నారు. అయితే ఈ విషయం తెలియని చాలా మీడియా సంస్థలు అరుణ్ సింగ్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొని బీజేపీ తీర్ధం పుచ్చుకున్నట్లు రిపోర్ట్ చేశాయి.
అయితే విజయశాంతి సోమవారం రాత్రి అధికారికంగా నడ్డా తో పార్టీ కండువా కప్పించుకొని బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన సందర్భంలో విజయశాంతి తన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ను గద్దె దించడమే తన లక్ష్యమని పేర్కొంటూ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా సమర్ధువంతంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.