Durga Temple EO : తీవ్రమైన అవినీతి,అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబును ఆకస్మికంగా బదిలీ చేశారు.ఆయన ని రాజమండ్రి దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ గా పంపారు.రాజమండ్రిలో ఇప్పుడు ఆ పదవిలో ఉన్న భ్రమరాంబను కనకదుర్గమ్మ ఆలయ ఈవో గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.అయితే సురేష్ బాబు బదిలీకి ముందు చాలా హైడ్రామా నడిచింది.
అవినీతి నిరోధక శాఖ ఆయన మీద అనేక ఆరోపణలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి ప్రత్యేకంగా సమర్పించింది.ఈ నేపధ్యంలో ఆయనపై వేటు తప్పదని అందరూ భావిస్తే ప్రభుత్వం ఆయన ను జస్ట్ బదిలీ చేసి చేతులు దులుపుకుంది.ఒక మంత్రి ,ఒక స్వామీజీ సురేష్ బాబుకు అండగా నిలబడి ఆయనపై ఈగ వాలకుండా రాజమండ్రికి పంపేశారని చెబుతున్నారు.
అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు!
వివరాల్లోకి వెళితే .. ఇంద్రకీలాద్రి ఆలయానికి ఈఓగా సురేష్ బాబు నియామకం అయినప్పటి నుంచి వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయ్. ఏసీబీ, విజిలెన్స్ దాడులు తరచూ జరిగాయి.ఫిబ్రవరి 18 నుంచి 20 వరకూ మూడు రోజులపాటు దుర్గగుడిలో సోదాలు చేపట్టింది ఏసీబీ. భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్టుగా నివేదిక రెడీ చేసి ప్రభుత్వం, దేవాదాయశాఖకు ఇచ్చింది.
Durga Temple EO : ఈవో అక్రమాల చిట్టా తయారు!
ఏసీబీ నివేదిక ఆధారంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 16మంది అధికారులపై దేవాదాయశాఖ చర్యలు తీసుకుంది. ఆ తర్వాత ఈఓ పాత్రపై ప్రత్యేక విచారణ చేపట్టిన ఏసీబీ, విజిలెన్స్ కీలక ఆధారాలు సేకరించి.. ఆయన తీసుకున్న నిర్ణయాలపై ఓ నివేదికను ప్రభుత్వానికి అందించింది. అందులో ఈఓ అనేక ఆర్ధిక తప్పిదాలకు పాల్పడినట్టు తెలిపింది ఏసీబీ. ఆడిట్ అభ్యంతరాలను, దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలను ఈఓ సురేశ్ బాబు బేఖాతర్ చేసి చెల్లింపులు జరిపినట్టు నిర్ధారణ అయ్యింది.టెండర్లు, కొటేషన్లు, సామాగ్రి కొనుగోళ్లు, మెటీరియల్ సరఫరాలపై ఫ్రీ ఆడిట్ అభ్యంతరాలున్నా.. ఈఓ సురేష్ బాబు చెల్లింపులు చేశారు. శానిటరీ టెండర్లను సెంట్రల్ విజిలెన్స్ నిబంధనలకు విరుద్ధంగా కేఎల్ టెక్నాలజీస్కు అప్పగించారాయన. తక్కువ సొమ్ముకు కోట్ చేసిన స్పార్క్ కంపెనీని కాదని ఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారని ఏసీబీ నివేదిక ఇచ్చింది.ఈ నేపధ్యంలో కార్యనిర్వహణ అధికారి సురేష్ బాబు మీద కఠిన చర్యలు ఉంటాయని అందరూ భావించారు.అయితే ఇందుకు భిన్నంగా కేవలం బదిలీతోనే ప్రభుత్వం సరిపెట్టేసి ఆయనను దాదాపు రక్షించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనసేన ధ్వజం !
కనకదుర్గ ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్బాబును సస్పెండ్ చేయకుండా బదిలీ చేయడం దారుణమని జనసేన ధ్వజమెత్తింది.సురేష్ బాబు సాక్షాత్తు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బినామీ అని ఆరోపించింది.ఒకవేళ సురేష్ బాబు పై కఠిన చర్యలు తీసుకుంటే ఆయన అప్రూవర్గా మారతారేమోనని భయపడి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రిని బతిమిలాడుకొని బదిలీ మాత్రమే చేయించారని జనసేన పేర్కొంది .అయితే సురేష్ బాబు పై పోరాటాన్ని ఇంతటితో విరమించేది లేదని ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యే వరకు తాము ఉద్యమిస్తూనే ఉంటామని జనసేన నాయకుడు పోతిన మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?