(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 4వ తేదీనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కావాల్సి ఉండగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించినందున ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు.
తదుపరి ఈ నెల 18వ తేదీన ఫ్లైఓవర్ ప్రారంభించడం జరుగుతుందనీ ఒక పక్క ఎంపి కేశినేని నాని, మరో పక్క మంత్రి శంకర నారాయణలు ప్రకటించారు. అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రేపు (18వ తేదీ) నిర్వహించతలపెట్టిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడినట్లు విజయవాడ ఎంపి కేశినేని నాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ప్రజా అవసరాల దృష్యా ఈ ఫ్లైఓవర్పై ట్రాపిక్ రేపటి నుండి వదలడం జరుగుతుందని ఎంపి కేశినేని పేర్కొన్నారు. ఫ్లైఓవర్ అధికారికంగా ప్రారంభోత్సవం నిర్వహించకపోయినా రేపటి నుండి వాహనాల రాకపోకలు అనుమతి ఇవ్వడంతో విజయవాడ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ఇప్పటికే జాతీయ రహదారుల, ఆర్ అండ్ బి అధికారులు పలు పర్యాయాలు ఫ్లైఒవర్పై లోడ్ టెస్ట్లు నిర్వహించారు. ఫ్లైఒవర్ రోడ్లో సెంట్రల్ డివైడర్ పెయింటింగ్, జీబ్రా లైన్లు, ట్రాఫిక్ సిగ్నల్తో కూడిన బోర్డ్ల ఏర్పాటు పనులు పూర్తి అయ్యాయి. ఫిల్లర్కు ఫిల్లర్కు మధ్య జాయింట్లను కలుపుతూ తుది మెరుగుల పనులు పూర్తి చేస్తున్నారు.
టిడిపికి చెందిన పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ఫ్లైఒవర్ ప్రారంభోత్సవం కాకపోయినా రేపటి నుండి వాహనాల రాకపోకలు జరుగుతాయని చెప్పారు. అయితే ప్రభుత్వ పరంగా ఇంత వరకూ ఫ్లైఓవర్పై రేపటి నుండి వాహనాల రాకపోకలను అనుమతి ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు.