అందాల పోటీలో ఏపిలోని విజయవాడకు అరుదైన ఘనత దక్కింది. మిసెస్ ప్లానెట్ విజయవాడ మహిళ దక్కించుకున్నారు. బల్గేరియాలో జరిగిన మిసెస్ ప్లానెట్ అందాల పోటీల్లో విజయవాడకు చెందిన బిల్లుపాటి శివ నాగ మల్లిక విజేతగా నిలిచారు. బర్లాస్ సమ్మర్ ఫెస్టివల్ అండ్ మిసెస్ ప్లానెట్ అంతర్జాతీయ అందాల పోటీలను బల్గేరియా దేశంలో ఈ నెల 6 నుండి 15వ తేదీ వరకూ జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న విజయవాడ ఆటోనగర్ కు చెందిన బిల్లుపాటి నాగమల్లిక వివాహితుల విభాగంలో 60 మంది ఇతర దేశాల వివాహితులతో ఏడు రౌండ్ లలో తలపడి మిసెస్ ప్లానెట్ టైటిల్ గెలుచుకుని ప్రపంచ అందాల పోటీల్లో తెలుగు వారి ఖ్యాతిని మరో సారి చాటిచెప్పింది.
నాగమల్లిక గతంలో 2019లో మిసెస్ అమరావతి, 2020లో మిసెస్ ఆంధ్రప్రదేశ్, 2021లో మిసెస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. ఈ ఏడాది మిసెస్ ప్లానెట్ పోటీల్లో విజేతగా నిలిచి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. నాగమల్లిక ఎంబీఏ పూర్తి చేశారు. ఆమె భర్త జితేంద్ర వ్యాపారవేత్తగా స్ధిరపడ్డారు. వీరికి ఆరవ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. విజయవాడ లాంటి నగరం నుండి వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడం ఆనందంగా ఉందని మల్లిక పేర్కొన్నారు. తన విజయంలో కుటుంబ సభ్యులు, భర్త జితేంద్ర ప్రోత్సాహం ఉన్నాయని తెలిపారు.