తెలుగుదేశం పార్టీలో నిరాసక్త వాతావరణం నెలకొంటోంది.టిడిపి ఎమ్మెల్యేలు సైతం జంప్ అవుతుండగా పార్టీని అంటిపెట్టుకుని ఉందామనుకుంటున్న నాయకులు కార్యకర్తలకు కూడా నిరాశానిస్పృహలు ఎదురవుతున్నాయి.
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు,ఆయన కుమారుడు లోకేష్ బాబు పూర్తిగా ప్రజలకు ,పార్టీ వారికి దూరంగా ఉండటమే ఇందుకు కారణం.ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎప్పుడూ ప్రజల్లో ఉండటం ముఖ్యం.అలాగే క్యాడర్ ను కాపాడుకోవడం ఇంకా అవసరం.అయితే కరోనా వ్యాప్తి నేపధ్యంలో చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ బాబులు నెలల తరబడి హైదరాబాద్ కి పరిమితమయ్యారు.కరోనా తగ్గుముఖం పట్టాక ఎట్టికేలకు వారు అమరావతి చేరుకున్నారు.తమ అభిమాన నేత చాలా రోజుల తర్వాత ఏపీకి చేరుకోవడంతో క్యాడర్ అంతా అక్కడికి చేరుకున్నారు. కానీ.. వారికి చంద్రబాబుతో సమావేశం అయ్యే ఛాన్స్ దక్కలేదట. కరోనా భయంతో చంద్రబాబు ఎవరినీ దగ్గరకు రానివ్వడంలేదు.
దీంతో ఆయనను కలవడానికి వచ్చిన నేతలంతా అసంతృప్తితో వెనుదిరిగి వెళ్లిపోయారు.ఈ మాత్రం దానికి చంద్రబాబు హైదరాబాద్ నుండి ఏపికి రావడం ఎందుకు అని పార్టీ వారే పెదవి విరుస్తున్నారు.సరే చంద్రబాబుకు వయసు మీద పడింది కాబట్టి ఆయన జాగ్రత్తలో ఆయన ఉన్నారనుకుంటే యువకుడైన లోకేశ్ బాబు ఏం చేస్తున్నారన్న ప్రశ్న ఎదురవుతోంది.దానికి సమాధానం కూడా పార్టీ వారే ఇస్తున్నారు అనుకోండి.లోకేష్ తండ్రి చాటు బిడ్డ స్వయం ప్రకాశ శక్తి లేని నాయకుడని వారు చెప్పుకుంటున్నారు.తండ్రి మార్గదర్శకాలతో లోకేష్ బాబు ముందుకు వెళుతుంటారని ఆయనంతట ఆయనగా ఏమీ చేయలేరని వారు అంటున్నారు.
అసలే వైసిపి ప్రభుత్వం దూకుడుగా ఉన్న నేపథ్యంలో టిడిపిని వారిద్దరూ ఇలా గాలికి వదిలేస్తే ఎలా అని పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తోంది.ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న నేత నెలలకు నెలలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతే ఏ క్యాడర్కు అయినా నిరాసక్తతే ఉంటుంది. అంతేకాదు.. ఆ నేతను మరిచిపోవాల్సిన పరిస్థితులూ వస్తాయి.చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ బాబులు ఈ నగ్న సత్యాన్ని తెలుసుకుంటే మంచిదని పార్టీ వారే అంటున్నారు.జూమ్ కాన్ఫరెన్స్తో ఎన్నో రోజులు పార్టీని నడపలేరని ప్రత్యక్ష సంబంధాలు లేకుంటే పార్టీ పరిస్థితి ఇంకా దిగజారి పోగలదని వారు హెచ్చరిస్తున్నారు