Aanandhayya Medicine: కరోనావ్యాధిపై బాగా పనిచేస్తుందని పేరుతెచ్చుకున్న కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య రూపొందించిన ఆయుర్వేద మందు పై వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ నుండి ఆ మందు పంపిణీ ఆగిపోయింది.అంతేగాక అదనపు భద్రత పేరుతో ఆనందయ్య ను కూడా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని ఒక గెస్ట్ హౌస్ లో ఉంచిన విషయం తెలిసిందే.
ఆనంద్ మందుపై పరిశోధనలు అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇవాళ రేపో నివేదిక వస్తుందని చెబుతున్నారు.ఈ కారణాల వల్ల సామాన్యుడికి ఆనందయ్య మందు దొరకడం లేదు.కానీ మంత్రుల స్థాయి వీఐపీలు మాత్రం ఆనందయ్య చేత మందు తయారు చేయించుకుని తమకు అవసరమైన వారికి తీసుకువెళుతున్నట్లు నెల్లూరులో గుప్పుమంటోంది.
ప్రకాశం మంత్రులకు మందు అందించిన ఎంపీ
రెండు రోజుల క్రితం క్రితం ప్రకాశం జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం ఒంగోలులో జరగ్గా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వద్ద ఆనందయ్య మందు ప్రత్యక్షమైంది.ఈ సమావేశంలోనే ఆయన స్వయంగా ఆ మందును జిల్లా మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి ఆదిమూలపు సురేష్ లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు అందజేశారు.ఈ మందు ఎంపీ గారి దగ్గరికి ఎలా వచ్చిందన్నదే చిదంబర రహస్యం.
Read More: Anandaiah Medicine: ఆనందయ్య మెడిసిన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!!
నాలుగు కార్లలో తెప్పించుకున్న కృష్ణాజిల్లా మంత్రిగారు!
ఇదిలా ఉండగా కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రిగారు కూడా ఆనందయ్య మందును తెప్పించుకున్నట్లు సమాచారం. ఏకంగా నాలుగు కార్లలో బక్కెట్ల నిండా నింపిన ఆనందయ్య మందును సదరు మంత్రిగారు తెప్పించుకున్నారట.శనివారం రాత్రి ఈ మందు డెలివరీ జరిగిందంటున్నారు.ఈ విషయమై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.పోలీసుల అదుపులోనే ఉన్న ఆనందయ్య చేత నయానో భయానో ఈ మందును తయారు చేయించుకుని వీఐపీలు పట్టుకుపోతున్నారు అంటున్నారు.ప్రజలు ఎప్పుడీ మందుకు అనుమతి లభిస్తుందా మాకు ఎప్పుడు దొరుకుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తుండగా తమకున్న పలుకుబడి ,పరపతితో వీఐపీలు మాత్రం ఆ మందును అప్పనంగా కాజేస్తున్నారు. ఇదే మరి సామాన్యుడికి వీఐపీ కి మధ్య వున్న పెద్ద గీత!