Lord Krishna Idol: సాధారణంగా మనకి గానీ లేదా కుటుంబ సభ్యులకు గానీ గాయమైతే వెంటనే ఆస్పత్రికి వెళ్తాం. కట్టు కట్టించుకోవడం లేదా డాక్టర్ సలహా మేరకు వైద్య చికిత్స పొంది మందులు తీసుకోవడమో చేస్తాం. అయితే ఉత్తరప్రదేశ్లో మాత్రం ఎవరు ఊహించని ఓ చోద్యం చోటుచేసుకుంది. ఆగ్రా(Agra)కు చెందిన ఒక దేవాలయ పూజారి కృష్ణుడి విగ్రహం పట్టుకొని ఒక ఆసుపత్రికి వెళ్లారు. అతన్ని చూసిన ఆసుపత్రి సిబ్బందంతా అవాక్కయ్యారు. అతను పడుతున్న కంగారు చూసి ఏం జరిగిందంటూ భయంతో అడిగారు వైద్య సిబ్బంది. సమాధానంగా తన ఆరాధ్య దేవుడు శ్రీకృష్ణుని విగ్రహం చేయి విరిగిందని.. దానికి వైద్యం చేయాలని ఏడుస్తూ వేడుకున్నారా పూజారి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
డాక్టర్లకు షాక్…
విగ్రహానికి (Lord Krishna Idol) వైద్యం ఏంటండీ అంటూ అక్కడి డాక్టర్లు పూజారి విజ్ఞప్తిని పెడచెవిన పెట్టారు. దాంతో బాగా మనస్తాపానికి గురైన పూజారి అక్కడే ఉన్న గోడకు తన తలను బలంగా మోదడం ప్రారంభించాడు. అతని తలకు గాయాలు కూడా అయ్యాయి. ఈ దృశ్యాలను చూసి వైద్యులు షాక్ తిన్నారు. వెంటనే కృష్ణుడి విగ్రహానికి కట్టు కట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన భారత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
అసలేం జరిగింది…
వివరాల్లోకి వెళితే.. అర్జున్ నగర్లోని ఖేరియా మోడ్లోని పత్వారీ ఆలయ పూజారి అయిన లేఖ్ సింగ్ శుక్రవారం ఉదయం ప్రతి రోజు లాగానే శ్రీకృష్ణుడి విగ్రహానికి స్నానం చేయించారు. ఈ క్రమంలో ఆ కృష్ణుడి విగ్రహం చేయి కాస్త దెబ్బతింది. అది చూసిన పూజారి(Priest) ఒక్కసారిగా మనస్తాపానికి గురయ్యారు. అప్పటికప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకుని ఆగ్రా జిల్లా హాస్పటల్ కి వెళ్లారు. విగ్రహానికి కట్టుకట్టాలని కోరితే.. డాక్టర్లు పూజారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ పూజారి మాత్రం వైద్యం చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో పూజారిని సంతృప్తి పరిచేందుకు డాక్టర్లు కృష్ణుడి విగ్రహానికి వైద్యం చేసినట్లు ప్లాస్టర్ వేశారు. అప్పటికిగానీ ఆ పూజారి మనసు కుదుట పడలేదు. ఈ విషయంపై ఆగ్రా జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ అగర్వాల్ స్పందించారు. పూజారి విజ్ఞప్తి మేరకు కృష్ణుడి విగ్రహానికి వైద్యం చేసి పంపించామని తెలిపారు.