Viral Video Effect: పశ్చిమ గోదావరి జిల్లా ఐటీడీఏ పిఓ రాసలీలల వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓ యువతి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిపై సంచలన ఆరోపణలతో విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలాన్ని రేపింది. ఇద్దరు మధ్య వర్తులు తనను పీఓ వద్దకు ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకువెళ్లారనీ, ఆ సమయంలో ఆయన తణుకు వార్డెన్ పోస్టు ఇప్పించేందుకు కమిట్మెంట్ అడిగారని ఆమె ఆరోపించింది. ఉద్యోగం వస్తుందన్న ఆశతో గత్యంతరం లేక ఆయనకు లొంగిపోయాననీ, పలు మార్లు శారీరకంగా వాడుకున్నారనీ యువతి వాపోయింది. ఉద్యోగం ఇప్పించకుండా మాయమాటలు చెబుతూ కాలయాపన చేస్తుండటంతో మోసపోయానని అర్థం అయ్యిందనీ, ఇలా మరో యువతి మోసపోకూడదన్న ఉద్దేశంతో విషయాలను వెల్లడిస్తున్నానని ఆమె వీడియో విడుదల చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది.
దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తొలుత ఆ అధికారిని అక్కడ నుండి బదిలీ చేసి విచారణకు ఆదేశించారు. ఈ తరుణంలోనే ఆ యువతి పీఓ ఏ తప్పు చేయలేదనీ, తనను వాడుకోలేదనీ, ఇద్దరు యువకులు తనతో బలవంతంగా వీడియో చేయించారంటూ మరో వీడియో విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ఆ యువతిపై నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ యువతి విడుదల చేసిన రెండు వీడియోల్లో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వ్యవహారంపై పోలవరం డీఎస్పీ లతాకుమారి విచారణ జరపగా పీఓకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో పలువురు యువతులను ఆయన లొంగదీసుకున్నాడని విచారణలో వెల్లడైంది.
తొలుత పీఓకు సహకరించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ జరపగా పీఓ రాసలీలల బండారం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో పిఓతో పాటు అయిదుగురిని అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం కోర్టులో హజరుపర్చారు. అనంతరం మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ వ్యవహారంలో బాధిత యువతి ఆవేదన కరెక్టేనని తేలింది. అయితే పీఓ తన రాసలీలల బండారం బయటపడకుండా ఉండేందుకు తన మనుషులతో ఆ యువతిని భయపెట్టి రెండో వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్టు చేయించినట్లు స్పష్టం అవుతోంది.