Visakha : ఏపి పరిపాలనా రాజధానిగా విశాఖపట్టణానికి తరలింపునకు జగన్ సర్కార్ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తూనే ఉంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్సా సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ తదితరులు త్వరలో విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు జరుగుతుందని పలు సందర్భాలలో వెల్లడించారు. రాజధాని వ్యాజ్యం హైకోర్టులో నడుస్తున్నందున రాజధాని తరలింపు ఆలస్యం అవుతోంది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే వేగంగా రాజధాని తరలింపు ప్రక్రియ వేగంగా జరిపేందుకు ప్రభుత్వం సన్నద్దంగా ఉంది. ఇప్పటికే విశాఖలో పరిపాలనా రాజధానికి అవసరమైన భవనాల పరిశీలన చేసి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ విశాఖకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నది.
విజయవాడలో 13 కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మించతలపెట్టిన కమాండ్ కంట్రల్ రూమ్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకున్నది. ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని విశాఖలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నది. విశాఖలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణానికి కేటాయించిన రూ.13.80 కోట్లను విశాఖలో నిర్మించనున్న కమాండ్ కంట్రోల్ రూమ్ కు బదలాయిస్తున్నట్లు పేర్కొంది.
రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం తమకు సంబంధం లేదన్నట్లుగా ఇంతకు ముందే చెప్పేసింది. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అంటూ హైకోర్టు నందే అఫిడవిట్ దాఖలు చేసింది. అదే విధంగా న్యాయ రాజధాని విషయంలోనూ హైకోర్టు కర్నూలుకు తరలింపునకు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రే ఇటీవల తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ, హైకోర్టు ఏకాభిప్రాయానికి వస్తే హైకోర్టు మార్చుకోవచ్చంటూ క్లారిటీ ఇచ్చేసింది కేంద్రం. ఇక హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే క్షణం ఆలస్యం చేయకుండా పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించనున్నది. ఒక వేళ ప్రతికూలంగా తీర్పు వస్తే వెంటనే ఈ తీర్పును ప్రభుత్వం. సుప్రీం కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. మరో పక్క రాజధాని అమరావతి ప్రాంతంలో ఏడాదికి పైగా రైతులు తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు.