విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతల అధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని నోటీసు బోర్డులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నేడు మరో ఇద్దరు టీడీపీ నేతల ఆక్రమణలను రెవెన్యూ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని నిర్ణయించిన జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆక్రమణలపై దృష్టి పెట్టింది. అదే విధంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆక్రమణలు, అక్రమ లీజుల వ్యవహారంపైనా దృష్టి పెట్టి అధికారులు సదరు ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆదివారం వేకువజామున టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ప్రసాద్ ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధురవాడ రెవెన్యూ అధికారులు రుషికొండ సమీపంలో గెడ్డ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. అదే విధంగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పీలా గోవింద్ ఆక్రమణలో ఉన్న అనందపురం మండలంలో దాదాపు 60 ఎకరాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఈ భూమి విలువ సుమారు 300 కోట్ల రూపాయల పైగానే ఉంటుందని అంచనా.