3 రాజధానుల నిర్ణయం గవర్నర్ నుండి ఆమోదం రావడంతో విశాఖపట్టణానికి రాజధాని తరలింపు ఎప్పుడు అని ప్రకటన ప్రభుత్వం నుండి వస్తుందని చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఏపీ రాజధాని మ్యాటర్ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండటంతో ఏపీ రాజధాని విషయంలో అందరికీ గందరగోళ పరిస్థితి నెలకొంది. మొదట ఈ నెల 16 వ తారీఖున రాజధాని ప్రకటన వస్తుందన్నారు, తాజాగా హైకోర్టు ఈనెల 27వ తారీకు వరకు అమరావతిలో యధాతథ స్థితి పాటించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఇటీవల పాలనా వికేంద్రీకరణ చట్టం అదేవిధంగా సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలను, చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన 55 పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధమంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని దృష్టికి తీసుకొచ్చారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఒక రాజధాని ప్రస్తావన ఉందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా పిటిషన్లు ప్రత్యక్ష పద్ధతిలో విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరగా హైకోర్టు కరోనా వైరస్ కారణంగా ప్రత్యక్ష విచారణ కష్టమని తెలిపింది.
గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు ఈ నెల 27 వరకు అమల్లో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో చాలా వరకు విశాఖ రాజధాని ప్రకటన ప్రభుత్వం నుండి దసరాకి వస్తుందన్న భావన లో ఫిక్స్ అయిపోయారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర గవర్నర్ మూడు రాజధానులు విషయంలో సానుకూలంగా ఉండటం తో… దాదాపు విశాఖ కి రాజధాని దసరా సమయంలో తరలింపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.