విశాఖ పట్నం, ఫిబ్రవరి 24 : ఎమ్పి అవంతి శ్రీనివాస రావు పార్టీ మారిన తర్వాత మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి బాగాలేదని బిజెపి ఎమ్ఎల్ఏ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఆదివారం విష్ణుకుమార్ రాజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ… భీమిలిలో గంటా గెలుస్తారో గెలవారో కూడా చెప్పలేమని అన్నారు.
తన మీద పోటీ చేయడానికి బలమైన ప్రత్యర్థి వెతకడం కాదు..ముందు సిట్ నివేదికను బయట పెట్టాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతోనే సిట్ నివేదికను చంద్రబాబు దాచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. దమ్ముంటే సిట్ నివేదికను బయట పెట్టిన తర్వాతే, తనపై అభ్యర్థిని పోటీకి దించాలని విష్ణుకుమార్ రాజు చంద్రబాబుకు సవాల్ విసిరారు.
విశాఖ రైల్వే జోన్ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అని విష్ణుకుమార్ రాజు అన్నారు. రైల్వే జోన్ అంశంపై తాము కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ను శనివారం కలిసామని చెప్పారు. గోయల్ సానుకూలంగా స్పందించారని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ప్రధాని సభ రోజున కానీ, అంతకంటే ముందే కానీ విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తారని విష్ణుకుమార్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందనీ, ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిస్తే రైల్వే జోన్ నేనే తెచ్చాను అని శంకుస్థాపన చేసినా చేస్తారని విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ లకు అలాగే చంద్రబాబు శంకుస్థాపన చేశారని ఆయన విమర్శించారు.