Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు కీలక నిందితుడుగా సునీల్ కుమార్ యాదవ్ అనే యువకుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సునీల్ కుమార్ ను ఇటీవల పులివెందుల కోర్టుకు హజరుపర్చగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 4వ తేదీ నుండి కడప సెంట్రల్ జైలులో సునీల్ కుమార్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ నెల 2వ తేదీన సునీల్ కుమార్ ను గోవాలో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సునీల్ కుమార్ యాదవ్ ను 13 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు పది రోజులు మాత్రమే కస్టడీ విచారణకు అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ రోజ నుండి ఈ నెల 16వ తేదీ వరకూ సునీల్ కుమార్ ను సీబీఐ కస్టడీకి తీసుకోవచ్చని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు అనుమతులతో సీబీఐ అధికారులు కడప సెంట్రల్ జైలులో ఉన్న సునీల్ కుమార్ ను సాయంత్రం కస్టడీకి తీసుకున్నారు.
వివేకా హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్ ప్రమోయంపై చాలా అనుమానాలు ఉన్నాయనీ, ఇప్పటికే వాచ్ మెన్ రంగన్న వాంగ్మూలంలో కూడా సునీల్ పేరు ప్రస్తావించడంతో అతనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సీబీఐ కోర్టులో వాదించింది. సునీల్ కుమార్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని సీబీఐ అధికారులు కోర్టుకు విన్నవించడంతో ఏకీభవించిన కోర్టు పది రోజుల కస్టడియల్ విచారణకు అనుమతి ఇచ్చింది.
కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ అధికారులు గత 60 రోజులుగా వివేకా హత్య కేసు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో సాక్షాధారులు మాయం చేశారన్న అభియోగంపై గతంలో సిట్ ముగ్గురిని అరెస్టు చేయగా వారు బెయిల్ పై విడుదల అయ్యారు. ఇక సీబీఐ అధికారులు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి అరెస్టుగా సునీల్ కుమార్ యాదవ్ ను చేశారు.