Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి కడప సబ్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను కడప సబ్ కోర్టు డిస్మిస్ చేసింది. వివేకా హత్య కేసులో రెండేళ్ల క్రితం హత్యాస్థలంలో సాక్షాలు తారుమారు చేశారనే అభియోగంతో ఎర్ర గంగిరెడ్డిని అప్పటి సిట్ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. మూడు నెలల వరకూ సిట్ అధికారులు చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో 90 రోజుల తరువాత ఎర్ర గంగిరెడ్డికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదల అయ్యారు.
ఆ తరువాత ఈ కేసు సిట్ నుండి సీబీఐకి బదిలీ అయిన నేపథ్యంలో వీరి విచారణలో ఎర్ర గంగిరెడ్డిని ప్రధాన నిందితుడుగా తేలింది. తాజాగా ఇదే కేసులో ఆయనను అరెస్టు చేయాలంటే గతంలో ఉన్న బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ..కడప కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణలో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఎర్ర గంగిరెడ్డి తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన సబ్ కోర్టు.. సీబీఐ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో సీబీఐ అధికారులు సబ్ కోర్టు తీర్పును జిల్లా కోర్టు లేదా హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.
మరో పక్క వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారులు ఎవరు అనేది తెలుసుకునే పనిలో సీబీఐ అధికారులు కోర్టు అనుమతితో శివశంకరరెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ ముందుకు సాగుతోంది. అయితే మరో పక్క సీబీఐ పైనే ఆరోపణలు చేస్తూ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.