Viveka Murdur Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. హత్య కేసు దర్యాప్తును సీబీఐ అధికారులు వేగవంతం చేస్తుంటే పలువురు అనుమానితులు సీబీఐ అధికారులకే చుక్కలు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేస్తూ పోలీసు అధికారులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు. తాజాగా నేడు వివేకా హత్య కేసులో అనుమానితుడు ఉదయ్ కుమార్ రెడ్డి కడప అదనపు ఎస్పీ మహేష్ కుమార్ ను కలిసి సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన విషయాలు చెప్పినా పట్టించుకోవడం లేదని ఉదయ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తాము చెప్పినట్లు వినాలని సీబీఐ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Viveka Murdur Case: సీబీఐ అధికారులపై ఫిర్యాదుల పరంపర
సీబీఐ అధికారులు గతంలోనే ఉదయ కుమార్ రెడ్డి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పలు మార్లు విచారించారు. నిన్న కూడా పిలిపించి విచారణ జరిపారు. ఉదయ్ కుమార్ రెడ్డి యూసీఐఎల్ లో ఉద్యోగిగా పని చేస్తున్నారు. వివేకా మృతదేహానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి ప్రకాశ్ రెడ్డి కుట్ల వేశారని సీబీఐ అభియోగం నమోదు చేసింది. ఎంపి అవినాష్ రెడ్డి సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన తరువాత సీబీఐ అధికారులపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. తొలుత గంగాధర్ రెడ్డి అనంతపురం ఎస్పీని కలిసి సిబీఐ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వివేకా పీఏ కృష్ణారెడ్డి కూడా సీబీఐ అధికారులపై ఆరోపణలు చేస్తూ కడప ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.
తాజాగా ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు
వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె, అల్లుడిపైనే కొంత మంది ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల పాటు విచారణను నిలుపుదల చేసిన సీబీఐ అధికారులు మరల రెండు రోజుల నుండి దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే వివేకా హత్య వెనుక భారీ కుట్రను వెలికి తీసే దిశగా దర్యాప్తు సాగిస్తున్నామని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జి షీటులో పేర్కొంది. హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు పలువురు ప్రముఖులు ప్రయత్నించారనీ సీబీఐ పేర్కొంది. సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటు అంశాలు వెలుగులోకి రావడం, మరో సారి ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించిన నేపథ్యంలో ఆయన కడప అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.