టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ లను ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీళ్లపై నాన్ బెయిలబుల్ సెక్షన్ ల కింద సీఐడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం గురువారం సాయంత్రం అయ్యన్న పాత్రుడు, ఆయన తనయుడు రాజేష్ లను సీఐడీ పోలీసులు విశాఖ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హజరుపర్చగా, మెజిస్ట్రేట్ రిమాండ్ రిపోర్టును తిరస్కరించి బెయిల్ మంజూరు చేశారు. ఫోర్జరీ పత్రాలు కోర్టు సమర్పించారన్న అభియోగంపై వారిపై ఐపీసీ 464, 467, 471, 474, సెక్షన్ల కింద అరెస్టు చేశారు సీఐడీ అధికారులు.
అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ లను కోర్టుకు హజరుపర్చిన సమయంలో నిందితుల తరపు న్యాయవాది సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు వర్తించవనీ, అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని తెలిపారు. దీంతో ఈ కేసులో నిందితులపై మోపిన ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని మెజిస్టేట్ తేల్చారు. నిందితులకు వెంటనే బెయిల్ మంజూరు చేశారు. నిందితులకు సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సీఐడీని కోర్టు ఆదేశించింది.
ఇంతకు ముందు కూడా ఏపీ సీఐడీ అధికారులు నిబంధనలు పాటించకుండా నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చిన సందర్భాల్లో రిమాండ్ రిపోర్టులను మెజిస్ట్రేట్ తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. తాజా పరిణామంతో ఏపీ సీఐడీకి మరో సారి షాక్ తగిలినట్లు అయ్యింది. మరో పక్క అయన్న పాత్రుడు అరెస్టును ఖండిస్తూ టీడీపీ శ్రేణులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు అయ్యన్న అరెస్టును తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.