YS Sharmila : తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సోదరుడు జగన్ తెలంగాణలో బాగా బలంగా ఉన్న టీఆర్ఎస్ బీజేపీలను ఆమె టార్గెట్ చేశారు . తాను పార్టీ పెట్టడం తన సోదరుడు ఏపీ సీఎం జగన్కు ఇష్టం లేదని అన్నారు. తనకు రాజకీయ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదో జగన్ నే అడగాలన్నారు. తెలంగాణా ప్రయోజనాలే తనకు ముఖ్యమని..ఇక్కడ కొందరు మతంపేరుతో.. ఇంకొందరు ఉద్యమం పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
పార్టీ వివరాలు త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు.పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తానని.. ప్రతి అమరవీరుల కుటుంబం తలుపు తడుతానని ఆమె వివరించారు. తెలంగాణాలో ప్రతిపక్షం సమర్ధవంతంగా పనిచేయడంలేదని… అందుకే ఫామ్ హౌజ్ నుంచే పాలన సాగుతోందని విమర్శించారు. పెద్ద పెద్ద బడా నాయకులే అవసరంలేదని… మంచి నాయకులు ఎవరు తమపార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు షర్మిల.
YS Sharmila : నేను తెలంగాణ పక్కా లోకల్!
తన స్థానికతపై వస్తున్న విమర్శలపైనా షర్మిల స్పష్టత ఇచ్చారు. మీడియాతో ఆమె చిట్చాట్ నిర్వహించారు. తెలంగాణలోనే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే పిల్లలను కన్నాను. సీఎం కేసీఆర్, బీజేపీ నేత విజయశాంతి ఎక్కడ పుట్టారు?’’ అని ప్రశ్నించారామె. తాను ఎవరూ వదిలిన బాణం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టడం సీఎం జగన్కు ఇష్టం లేదని వెల్లడించారు. జగన్తో తనకున్నవి పార్టీ పరమైన విభేదాలు మాత్రమేనని చెప్పారు. తనకు ఎందుకు వైసీపీలో ప్రాధాన్యత ఇవ్వలేదో జగన్ను అడగాలని, తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని మరోసారి షర్మిల స్పష్టం చేశారు.హైదరాబాద్తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని.. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని మరోసారి స్పష్టం చేశారు.. దివంగత మాజీ సీఎం జయలలిత ఎక్కడ పుట్టి, ఎక్కడ సీఎం అయ్యారో అందరికీ తెలుసని చెప్పారు.
టీఆర్ఎస్ ..బీజేపీల పై మాటల ఈటెలు!
ఉద్యమం అంటూ ఒకరు.. మతం అంటూ మరొకరు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. తెలంగాణ అభివృద్ధిపై ఎవరికీ చిత్తశుద్ధిలేదని ఆక్షేపించారు. అతిత్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ను ఎదురించడానికైనా సిద్ధమని స్పష్టత ఇచ్చారు. పోలవరం నుంచి పోతిరెడ్డిపాడు దాకా తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నారు. తెలంగాణలో రాజన్న పథకాలనే కాపీ కొట్టారని షర్మిల ఆరోపించారు.‘
తల్లి విజయమ్మ నావైపే!
తెలంగాణలో వైసీపీ ఎక్కడుందని ప్రశ్నించారు షర్మిల. పార్టీ ఏర్పాటులో తన భర్త అనిల్, తల్లి విజయమ్మల సహాకారం ఉందన్నారు. కోవిడ్ సమయంలో ఆస్పత్రులు లక్షలు వసూలు చేశాయి. ఆస్పత్రుల దోపిడీపై సీఎం కనీసం దృష్టిపెట్టలేకపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. లోటస్పాండ్లోని తన నివాసం నుంచే పార్టీ ప్రస్థానం మొదలవుతుందని స్పష్టం చేశారు షర్మిల.