అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే జిల్లా కలెక్టర్లే జాగ్రత్తగా ఉంటారు!మరికొందరు అధికారులైతే వారికి వంగివంగి దండాలు పెడుతుంటారు.
అయితే తెలంగాణలో రెవెన్యూ శాఖలో చిన్న ఉద్యోగి అయిన ఒక వీఆర్వో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేపై నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పై గాజుల రామారం విఆర్ఒగా పనిచేస్తున్న శ్యామ్ కుమార్ తనను శాసనసభ్యుడు అసభ్య పదజాలం తో తీవ్రంగా దూషించాడంటూ మల్కాజిగిరి పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందచేశారు.వివరాల్లోకి వెడితే ఈనెల 3న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వేనంబర్ 79లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.ఆ ఏరియా వీఆర్వోగా అది తన విధి నిర్వహణలో భాగమన్నారు.అయితే మరుసటి రోజు ఎమ్మెల్యే వివేకానంద తనకు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో దూషించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.
తప్పుడు ఫిర్యాదులతో తనను ఏసీబీకి పట్టిస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారన్నారు వీఆర్వో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఇక వీఆర్వోను తిట్టిన విషయంపై ఎమ్మెల్యే వివేకానంద వివరణ ఇచ్చారు. గత ఆరేళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను కూల్చారని.. అడ్డు వచ్చిన గర్భిణి మహిళలు వికలాంగులపై దౌర్జన్యం చేశారని.. కరెంట్ మీటర్లు తీసుకెళ్లారని.. అందుకే తిట్టాల్సి వచ్చిందని తెలిపారు.ప్రభుత్వ అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా తమ విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే హితవు పలికారు.
అంతేగాకుండా అ వీఆర్ఓ లంచగొండి అని కూడా తన దృష్టికి వచ్చిందని అదే విషయం ఆయనను అడిగానని చెప్పారు.ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులకు అధికారాలు ఉంటే ప్రజాప్రతినిధిగా తనకు బాధ్యత ఉందని వివరించారు.పోలీసులు విచారించుకోవచ్చునని తన తప్పుంటే చర్యలు తీసుకోవచ్చునని కూడా వివేకానంద తెలిపారు.కాగా తమకు వీఆర్ఓ ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని పోలీసులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఇంకా కేసునమోదు చేయలేదని సమాచారం .ఏదేమైనా విజయవాడ లో ఎంపీ ఎమ్మెల్సీలకు భయపడిపోయిన ఏపీ పోలీసు సీనియర్ అధికారి కంటే ఈ విఆర్వోనే బెటర్ అన్పిస్తోంది కదూ!