కరోనా నేపథ్యంలో ప్రస్తుతం చాలా మంది ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తున్న కరోనా కవచ్ పాలసీలను తీసుకుంటున్నారు. కరోనా వస్తే ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందడం కోసం వారు ఈ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు. అయితే ఈ పాలసీల వల్ల పూర్తిగా క్యాష్ లెస్ పద్ధతిలో హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ పొందవచ్చు. ఇది ఎంతో సులభతరం కూడా. ఎమర్జెన్సీ సమయాల్లో ఈ ఇన్సూరెన్స్ ఎంతగానో పనికొస్తుంది. అనవసరంగా జేబు నుంచి డబ్బులను ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వారే చూసుకుంటారు. హాస్పిటల్లో చేరిన దగ్గర్నుంచీ డిశ్చార్జి అయ్యాక కోలుకునే వరకు ఇన్సూరెన్స్ కంపెనీ వారే క్యాష్లెస్ పద్ధతిలో సౌకర్యం అందిస్తారు. అయితే ఈ పాలసీలను తీసుకునేవారు, ఉపయోగించాలనుకునేవారు కింద తెలిపిన ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. అవేమిటంటే…
* చాలా వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు దేశంలోని అనేక ప్రైవేటు హాస్పిటళ్లతో టై అప్ అయ్యాయి. అందువల్ల వాటిని నెట్వర్క్ హాస్పిటల్స్గా వ్యవహరిస్తుంటారు. అయితే మీరు తీసుకున్న ఇన్సూరెన్స్కు ఏ నెట్వర్క్ హాస్పిటల్ అందుబాటులో ఉందో చూసుకుని వెళితే చాలా సులభంగా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదంటే ఆ ప్రక్రియ కొంత వరకు ఆలస్యం అవుతుంది.
* ఒక వేళ హాస్పిటల్లో చేరి చికిత్స పొంది తరువాత డిశ్చార్జి అయ్యాక ఆ ఖర్చు మొత్తాన్ని రీయెంబర్స్మెంట్ చేసుకుందామనుకుంటే.. మొత్తం బిల్లులు, ఇతర పత్రాలన్నింటినీ సేకరించి దగ్గర ఉంచుకోవాలి. ఆ తరువాతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి. దీంతో సులభంగా పాలసీ క్లెయిమ్ ప్రాసెస్ జరుగుతుంది. లేదంటే ఆలస్యం అవుతుంది.
* హాస్పిటల్లో చేరిన 24 గంటల లోపు లేదా హాస్పిటల్లో చేరుదామనుకునే సమయానికి 48 గంటల ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీకి తెలిపితే.. క్యాష్ లెస్ చికిత్స సులభంగా జరుగుతుంది.
* క్యాష్ లెస్ ట్రీట్మెంట్ తీసుకునేందుకు హాస్పిటళ్లలో ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన హెల్ప్ డెస్క్లు ఉంటాయి. వారికి ఆ చికిత్సకు గాను ఫాం నింపి ఇవ్వాలి. అలాగే వారు ఏదైనా అడిగితే వెంటనే సమాధానం ఇవ్వాలి. ఆలస్యం చేస్తే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందలేరు. అయితే తరువాతైనా ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ కోసం అప్లై చేయవచ్చు. హాస్పిటల్లో అయిన ఖర్చు మొత్తాన్ని తరువాత కూడా క్లెయిమ్కు అప్లై చేసి రీయెంబర్స్మెంట్ పొందవచ్చు. ఇక హాస్పిటల్లో ఫాం నింపి ఇవ్వగానే వారు తనిఖీ చేసి అప్రూవల్ లెటర్ ఇస్తారు. తరువాతే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మొదలవుతుంది.