తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరిట రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలుగా సాగిన పాదయాత్ర ప్రస్తుతం మూడో ధశలో కొనసాగుతోంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసిఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందన్న ఆరోపణలు రావడంతో రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఎక్కువయ్యాయి. మంగళవారం నిరసన కార్యక్రమంలో ఉన్న బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయడంతో కేసిఆర్ సర్కార్ పై ఆయన నిప్పులు చెరిగారు.
ఎక్కడ అయితే పాదయాత్రను అడ్డుకున్నారో అక్కడి నుండి కొనసాగిస్తానని బండి సంజయ్ ప్రకటించారు. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి, భద్రత కల్పించాలని కోరుతూ బీజేపీ మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. దీంతో మరో సారి బుధవారం పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. మరో పక్క బీజేపీ ప్రతినిధి బృందం మంగళవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను కలిసింది. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో పాటు యాత్రకు తగిన భద్రత కల్పించేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. గవర్నర్ ను కలిసిన వారిలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందనరావు, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, వివేక్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు ఉన్నారు.
మరో పక్క పాదయాత్ర నిలిపివేయాలంటూ బండి సంజయ్ కి వరంగల్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాదయాత్రకు సంబంధిత అధికారుల నుండి అనుమతి తీసుకోలేదనీ, సభల్లో నేతలు కించపరిచే ప్రసంగాలు చేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ ను, ముఖ్యమంత్రి కేసిఆర్ ను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ప్రతి విమర్శలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసులు పాదయాత్రను నిలుపుదల చేయాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం నుండి జరిగే పాదయాత్రపై ఉత్కంఠత నెలకొంది.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు లైన్ క్లీయర్ .. ఆ హోదా వచ్చేసినట్లే..!!