టీఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ చాణక్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిపాలనాపరంగా ఆయన తీసుకునే నిర్ణయాల వెనుక కూడా రాజకీయంగా ఏదో మతలబు ఉంటుందని చెప్తుంటారు.
తాజాగా తెలంగాణలో హాట్ టాపిక్ 50, 000 ఉద్యోగాల భర్తీ. దీనిపై రకరకాల విశ్లేషణలు వస్తుండగా తెలంగాణ జన సమితి నేత, మాజీ ప్రొఫెసర్ కోదండరాం ఘాటు వ్యాఖ్యలు చేవారు. ఉద్యోగాల భర్తీపై అనుమానాలు కలిగేలా ఆయన కామెంట్లు చేశారు. అయితే, దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.
కేసీఆర్ ను నమ్మండి
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో చేస్తున్న కృషిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఉద్యోగాల నియామకాలలో గణనీయమైన ప్రగతిని సాధించామని అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఆరేళ్ల కాలంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా వ్యవహరించి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అనేక కోర్టు కేసులను అధిగమించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేలాది ఉద్యోగాలను భర్తీ చేసిందని ఆయన తెలిపారు.
కోదండరాం కామెంట్ల కలకలం….
ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంకితభావం, నిబద్ధతతో కృషి చేశారని, రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగనున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ అంశంపై ప్రొ. కోదండరాం కు అపోహలు ఉండటం బాధాకరమని ఆయన అన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుందో ఒక ప్రొఫెసర్ గా విషయం తెలిసి కూడా ఆయన ప్రభుత్వంపై ఉద్దేశ్య పూర్వకంగా విమర్శలు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న సుమారు 50 వేల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం సీఎం కేసీఆర్ ఇటీవల ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి, దానికి అనుగుణంగా తక్షణమే కార్యాచరణను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఆదేశించారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. తదనంతరం సీఎస్. కూడా అధికారులతో సమావేశాన్ని నిర్వహించి ఉద్యోగ ఖాళీలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన వివరించారు.
ఉద్యోగాల భర్తీలో అవినీతి…
అవినీతికి, విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొ. ఘంటా చక్రపాణి, సభ్యులు రిక్రూట్మెంట్ విషయంలో చేసిన కృషిని వినోద్ కుమార్ అభినందించారు. రానున్న రోజుల్లో కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని, విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినోద్ కుమార్ కోరారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలు ఉద్యోగార్థుల మనసులో నిలిచిపోయే అవకాశం ఉందని భావించే తన నమ్మినబంటు అయిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ క్లారిటీ ఇప్పించారని పలువురు అంటున్నారు.