(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ మరో సాహసయాత్ర చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆయన మంచు కొండల్లో, ఘాట్ రోడ్లో బైక్ రైడ్, వెహికల్ రైడ్లు చేస్తూ వాటి ఫోటోలను, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటుంటారు.
తాజాగా భారత్ – టిబెట్/ చైనా సరిహద్దుకు సమీపంలోని తవాంగ్ జిల్లాలో పిటిఎస్వో లేక్ నుండి మాంగో ప్రాంతం వరకు 107 కిలోమీటర్లు ఎటివి (ఆల్ టైరెన్ వెహికల్) నడుపుకుంటూ వెళ్లారు. 15,600 అడుగుల ఎత్తులో, మంచు కొండల్లో 107 కిలో మీటర్ల ఘాట్ రోడ్డులో పెమా ఖండూ ఉత్సాహంగా వాహనాన్ని నడిపారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఉన్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పెమా ఖండూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సాహస యాత్రపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ‘16వేల అడుగుల ఎత్తులో ఏటివిని నడపడం చాలా కష్టమైన సవాల్. కానీ సిఎం పెమాఖండూ ఎంతో వేగంగా, అందంగా నడిపారు. ఆయన పక్కన నమ్మకంగా కూర్చున్నా’ అని ట్వీట్ చేశారు.
పెమాఖండూ ఇటీవల పాసిఘాట్ ప్రాంతంలో 122 కిలో మీటర్లు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై ఒంటరిగా ప్రయాణించి నెటిజన్లను అబ్బురపరిచారు.