బాహుబలి తర్వాత ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న రేంజ్ ని బట్టి ఏ నిర్మాతైనా సినిమా చేయాలంటే కనీసం 200-300 కోట్ల వరకైనా బడ్జెట్ కేటాయించాల్సిందే. బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత నుంచి డార్లింగ్ ప్రభాస్ ఎంచుకునే కథ లు కూడా ఆ బడ్జెట్ కి తగ్గట్టుగానే చాలా వైవిధ్యంగా ఉంటున్నాయి.
అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను దృష్ఠిలో పెట్టుకొని కొంతమంది జరుపుతున్న చర్చలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం బడ్జెట్ విషయం పక్కన పెడితే ప్రభాస్ ఎంచుకుంటున్న యూనివర్సల్ సబ్జెక్ట్స్ తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు ఆకట్టుకుంటాయో అన్న సందేహాలు మొదలయ్యాయంటున్నారు. అందుకు ఉదాహరణ గా సాహో సినిమాని చూపిస్తున్నారు. ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్ దర్శకుడు సిజీత్ సాహో సినిమా తీయడానికి చాలా కష్టపడ్డాడు. మేకింగ్ పరంగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
ప్రభాస్ కోసమే అన్నట్టుగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తీయడానికి హాలీవుడ్ తరహాలో కథ, స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. కాని ఈ సినిమా సౌత్ ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. హిందీలో మాత్రం సాహో భారీ విజయం దక్కించుకుంది. వసూళ్ళ పరంగా హిందీ వర్షన్ మాత్రమే గట్టెక్కింది. దానికి కారణం బాలీవుడ్ ప్రేక్షకులు ఆ తరహా చిత్రాలను ఎంజాయ్ చేస్తారు కాబట్టి. ఇప్పటికే ధూమ్ సిరీస్ క్రిష్ లాంటి సినిమాలు అక్కడ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అదే తరహా స్క్రీన్ ప్లేతో గ్రాండ్ గా తెరకెక్కిన సాహో బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చింది.
అయితే ప్రభాస్ ని టాలీవుడ్ లో ఒకే ఇమేజ్ తో చూడటం వల్ల తెలుగు ప్రేక్షకులు కొత్తగా ట్రై చేస్తే ప్రభాస్ సినిమాలను చూడలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. అదే ప్రభావం ఇప్పుడు ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ మీద కూడా పడుతుందా అని అనుమానాలు కలుగుతున్నాయట. అదే రిపీటయితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్సే కాదు .. ప్రేక్షకులు హర్ట్ అవడం ఖాయమని టాక్.