West Bengal : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (దీదీ)కి గాయాలు అయ్యాయి. నందిగ్రామ్ ఎన్నికల ప్రచార ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆమె కాలికి గాయం అయ్యింది. తాను కారు వద్ద నిల్చుని ఉండగా కొందరు వ్యక్తులు కారు డోర్ ను బలంగా తోయడంతో కాలికి బలమైన గాయం అయ్యిందని మమత పేర్కొంటున్నారు. గాయం వల్ల కాలుకు వాపు వచ్చిందన్నారు. తనపై దాడి వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు దీదీ. తాను ప్రచారానికి వెళ్లిన సమయంలో స్థానిక పోలీసులు ఎవరూ తన చుట్టూ లేరని ఆమె తెలిపారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. గాయపడిన దీదీని పార్టీ శ్రేణులు హుటాహుటిన కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించారు.
మమతా బెనర్జీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నందిగ్రామ్ వెళ్లారు. ఈ రోజు ఉదయం వివిధ దేవాలయాల్లో పూజల తరువాత హల్దియాలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ రాత్రికి నందిగ్రామ్ నియోజకవర్గంలోనే ఉండి గురువారం ఉదయం కోల్కతాకు వెళ్లాల్సి ఉంది. అయితే మమతకు గాయాలు కావడంతో భద్రతా సిబ్బంది కోల్కతాలోని ఆసుపత్రికి తరలించారు. నందిగ్రామ్ నుండి బీజెపీ తరపున సువేంద అధికారి పోటీ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మమత బెనర్జీపై దాడి జరగడం కల్పితమని, ఇది ఆమె ఆడుతున్న నాటకంగా బీజెపీ పేర్కొంటోంది. ఎన్నికల్లో పోటీ పడటానికి భయపడి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజెపీ నేతలు విమర్శిస్తున్నారు.
#WATCH West Bengal CM Mamata Banerjee brought to SSKM Hospital, Kolkata pic.twitter.com/8KVoBOPkHj
— ANI (@ANI) March 10, 2021