కోల్కతా, ఫిబ్రవరి 3: పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికీ, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికీ మధ్య వ్యవహారం ఉప్పునిప్పుగా తయారయింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) సమన్లకు స్పందించాల్సి ఉన్న కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కేంద్రంగా తాజా వివాదం తలెత్తింది. సిబిఐ విచారణకు భయపడుతున్నారని అర్ధం వచ్చేట్లు ఆయన కనబడకుండా పోయారన్న పుకార్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గట్టిగా ఖండించింది.
కమిషనర్ ఒక్కరోజు సెలవులో వెళ్లారు తప్ప ఆయన విధినిర్వహణకు వచ్చిన లోటేమీ లేదని పోలీసు శాఖ తెలిపింది. శారదా పోంజీ కుంభకోణం కేసుతో సహా పలు కేసుల్లో విచారణకు సహకరించాల్సిందిగా సిబిఐ ఆయనకు సమన్లు జారీ చేసింది.
నిన్న ప్రధాని కోల్కతాలో ఎన్నికల శంఖరావం పూరిస్తూ, మమతపై తీవ్ర విమర్శలు చేశారు. సిబిఐ అంటేనే మమత దీదీకి ఎందుకు భయమని ప్రశ్నించారు. ఆమెపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎక్కుపెట్టారు.
ప్రధాని మోదీ వేధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. నేడు ఆమె తన రాజధానీ నగరం పోలీస్ కమిషనర్ను సమర్ధిస్తూ ట్వీట్ చేశారు. కొల్కతా కమిషనర్ ప్రపంచంలోనే ఉత్తమమైన అధికారుల్లో ఒకరని, ఆయనలోని ధైర్యం, నిజాయితీలను ప్రశ్నించలేమని, ఆయన 24గంటలు పని చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు.
నిన్న ప్రధాని విమర్శకు మమత దీటుగా జవాబు ఇచ్చిన తర్వాత కేంద్రం తరపున సిబిఐ వేధింపు కార్యక్రమాలు మొదలుపెట్టిందని తృణమూల్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
బిజెపి అధిష్టానం చాలా నీచంగా రాజకీయ ప్రతీకారం తీర్చుకునే ధోరణితో వ్యవహరిస్తుందని అన్నారు. వారి లక్ష్యం కేవలం రాజకీయ పార్టీలే కాదు, పోలీసు వ్యవస్థను తమ అధీనంలో ఉంచుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలను బిజెపి నాశనం చేస్తున్నారని విమర్శించారు.