గత ఆరేడు నెలలుగా అన్ని చిత్ర పరిశ్రమలు షూటింగ్స్ లేక షట్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా నిబంధనలు పాటిస్తూ తిరిగి కేంద్ర ప్రభుత్వం సినిమాల షూటింగ్స్ కి పర్మిషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాల షూటింగ్స్ మొదలైపోయాయి. ఇక అక్టోబర్ నుండి స్టార్ హీరోలు కూడా తమ సినిమాల షూటింగ్స్ లో జాయిన్ అవబోతున్నారు. అయితే ఎటొచ్చి దర్శక ధీరుడు రూపొందిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి సంబంధించిన అప్డేట్ మాత్రం సరిగ్గా తెలియడం లేదు.
ఎన్టీఆర్, చరణ్ లాంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు.. అలాగే ఆలియభట్, అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ తో పాటు మరికొంతమంది ఫేమస్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా… వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
యూనిట్ లో గాని, జూనియర్ ఆర్టిస్టుల్లో గాని ఏ ఒక్కరు కరోనా భారిన పడినా ఆ ప్రభావం తీవ్రంగా షూటింగ్ మీద పడుతుందని అందరికీ తెలిసిందే. అందుకే ముందుగా రాజమౌళి.. ఎన్టీఆర్ పై సోలో షాట్స్ తీసి అతనికి సంబంధించిన టీజర్ ను రెడీ చేసి విడుదల చేయించాలి అనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. కానీ ఇప్పుడు ఆలియా ట్విస్ట్ ఇచ్చిందని తెలుస్తుంది.
చరణ్ కి జంటగా సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ పెట్టిన కండిషన్స్ రాజమౌళిని కన్ఫ్యూజన్ లో పడేసి టెన్షన్ పెడుతున్నాయని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా ఈ సినిమాలో ఆలియా కి సంబంధించిన సీన్స్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది. కాని పూణె షెడ్యూల్ క్యాన్సిల్ కావడంతో ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కుదరనే లేదు.
కాగా ఇప్పుడు ఆలియా అక్టోబర్ నుండీ ‘ఆర్.ఆర్.ఆర్’ కు డేట్స్ ఇస్తానని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లో డిసెంబర్ లేదా జనవరికి ఆలియా కి సంబంధించిన సీన్స్ అన్ని కంప్లీట్ చేయాలని రాజమౌళికి చెప్పిందట. అందుకు కారణం ఇప్పటికే ఆలియా కొన్ని బాలీవుడ్ సినిమాలు కమిటయి, ఆ సినిమాలకి డేట్స్ ఇవ్వడమే అని తెలుస్తుంది. ఆలియా ఇలా కండీషన్ పెట్టడంతో ఎన్టీఆర్.. ‘కొమరం భీమ్’ టీజర్ మీద ఎఫెక్ట్ పడుతుందని అభిమానులు ఆలియా మీద గుస్సా అవుతున్నట్టు తెలుస్తుంది.