YS Sharmila : తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిలను వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కలిశారు.
లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో గురువారం మధ్యాహ్నం షర్మిలతో రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో షర్మిలతో పది నిమిషాలు పాటు ఆయన మాట్లాడారు. అయితే అనిల్కుమార్తో ఏకాంతంగా దాదాపు గంటపాటు మంతనాలు జరిపారు. అనిల్కుమార్తో గంటపాటు జరిగిన చర్చలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ రెండు ప్రధాన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి పార్టీ విషయంలో వెనక్కి తగ్గాలని చెప్పి ఉంటారా? లేక తెలంగాణలో పార్టీ పెడితే ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్లాలి.. ఏ అంశాలను ప్రస్తావించాలి.. కార్యాచరణ ఏ విధంగా ఉండాలి.. అనే అంశాలపై అనిల్తో ఆళ్ల చర్చించి ఉంటారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆర్కే జగన్ వదిలిన బాణమా?
మరోవైపు తెలంగాణలో పార్టీని పెట్టేందుకు షర్మిల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ తెలుగు రాష్ట్రాల్లో హట్ టాపిక్గా మారింది. సీఎం జగన్, షర్మిల మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని, అయితే పార్టీ పెట్టే విషయంలో ఆమె సొంత నిర్ణయం తీసుకుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పంపిన దూతగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ విషయంలో షర్మిలకు ఏమైనా చెప్పి ఉంటారా అనే దానిపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని స్థాపించే విషయంలో ముందుకు పోతామని ఆళ్లతో షర్మిల స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తాను పెట్టే పార్టీపై జగన్ మద్దతు ఉంటుందని ఇప్పటికే షర్మిల చెప్పారు. అయితే ఆళ్ల వారిని రెగ్యూలర్గా కలుస్తున్నప్పటికీ తాజాగా జరిగిన భేటీ చర్చకు దారితీస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలతో జగన్, షర్మిల మధ్య ఫోన్ సంబంధాలు కూడా లేవని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా షర్మిలకు జగన్ చెప్పాలనుకుంటే ఆ బాధ్యత రామకృష్ణారెడ్డికే ఎందుకు అప్పగించారనే వాదన కూడా వస్తోంది.
YS Sharmila : షర్మిల పార్టీ వెనుక జగన్ స్ట్రాటజీ?
ఇదిలావుంటే జగన్, షర్మిల వేరువేరు కాదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాభవం కోల్పోయింది. దీంతో కాంగ్రెస్లో ఉన్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన కొందరు టీఆర్ఎస్లో చేరారు. అక్కడ కూడా ఇమడలేని నేతలు బీజేపీవైపు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నల్గొండ, మహబూబ్నగర్లో ఈ సామాజిక వర్గానికి చెందిన అగ్రనేతలు బీజేపీలోనే చేరాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ఉదాహరణ డీకే అరుణ. ఇక నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్, రాజశేఖర్రెడ్డికి అత్యంత విదేయులు. ఇద్దరు సోదరుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎటు పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. అలా అని ఆయన అటు కాంగ్రెస్ను వీడలేక ఇటు బీజేపీలో చేరలేక సందిగ్థంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలను కట్టడి చేసి.. వారిని బీజేపీలో చేరకుండా చేసేందుకే షర్మిల పార్టీ పెట్టిందనే విమర్శలు కూడా ఊపందుకున్నాయి. ఎందుకంటే సీఎం కేసీఆర్, జగన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. తెలంగాణలో బీజేపీ కట్టడి చేసేందుకు షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారనే వదంతులు జోరుగా సాగుతున్నాయి.