వైసీపీలో నంబర్ టూ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు విజయసాయిరెడ్డి…! సజ్జల, వైవి లాంటి వారు దీన్ని అంగీకరించకపోయినా… జగన్ కు అత్యంత సన్నిహితుడు మాత్రం విజయసాయిరెడ్డి మాత్రమే. అటువంటి దశలో విజయసాయి ఏంటి…? “నేను జగన్ తో ఉంటాను, ప్రాణం ఉన్నంత వరకు ఉంటాను” అని నిరూపించుకోవడం ఏంటి…? ఏమైంది ఈ ఇద్దరికీ…? అనే చర్చలు, ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అసలు ఈ చర్చకు కారణం ఏంటి? ఎక్కడ మొదలయ్యింది? జగన్, విజయసాయిల బంధం ఎలాంటిది..? ఎవరి పాత్ర ఏంటి ? అనేది లోతుగా చూడాల్సిందే. నిజానికి జైలుకి వెళ్ళాక ముందు నామమాత్రంగా ఉన్న బంధం… జగన్ తో జైలులో ఉన్నప్పటి నుండి వారిద్దరికీ మధ్య పార్టీ బంధం బలపడింది. అటువంటిది ఇప్పుడు విజయసాయికి కొత్త పరీక్షలు ఎదురవుతున్నాయి. ఇక్కడి వరకు రావడానికి కారణాలు ఏమిటి అనేది పరిశీలిస్తే..!
విశాఖ నుండి ఢిల్లీ వరకు…!
“విజయసాయి రెడ్డిని జగన్ కారు దింపేశారు. మంత్రి ఆళ్ళ నాని ని ఎక్కించుకున్నారు.” ఈ ఘటన ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన రోజున విశాఖలో జరిగింది. అక్కడ మొదలయ్యింది విజయసాయికి పరీక్ష. ఆ వీడియో బయటకు వచ్చింది… ఇదిగో విజయసాయిని జగన్ పక్కన పెట్టేసారు అంటూ వీడియో, వార్తలు, పుకార్లు బయట చక్కర్లు కొట్టాయి. నాటి నుండి విజయసాయి కాస్త సైలెంట్ అవ్వడం, ట్విట్టర్ లో పెద్దగా “ఆయన ముద్ర ” ఉన్న పోస్టులు లేకపోవడం…, చర్చకు దారితీసింది. తాజాగా సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాలనుకుంటే ముందుగానే అన్ని చూసుకోవాల్సిన విజయసాయి లేకుండా… అపాయింట్మెంట్ లు ఖరారుపై వేరే వారి ద్వారా ప్రయత్నించి… జగన్ ఢిల్లీ టూరు ఖరారు చేసుకున్నారు. (అది సడెన్ గా రద్దు అయినప్పటికీ… విజయసాయి ప్రమేయం లేకుండానే మొదట ఫిక్స్ అయింది)..! దీంతో విశాఖలో మొదలైన టాక్ ఢిల్లీ వరకు వెళ్ళింది. జగన్ విజయసాయిని పక్కన పెట్టారు అంటూ విపరీత చర్చకు దారితీసింది. టీడీపీ అయితే రెండు అడుగులు ముందుకేసి సోషల్ మీడియా వేదికగా ఆదుకున్నారు. విజయసాయి అప్రూవర్ గా మారిపోవాల్సిన టైం వచ్చింది, అంటూ వ్యంగ్య పోస్టులు పెట్టారు.
స్వీయ నిరూపణ…!
వైసీపీ లో ఏ మంత్రులో… ఏ ఎంపీ నో…, ఏ నాయకుడో .., ఏ ఎమ్మెల్యేనో “నేను జగన్ వెంటే ఉంటాను.., వైసిపిలోనే ఉంటాను” అంటూ నిరూపించుకుంటే అసలు ఆశ్చర్యం కాదు, కానీ విజయసాయి లాంటి వారికి ఆ పరిస్థితి రాకూడదు. కానీ వచ్చేసింది. రెండు రోజుల కిందట ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ నిరూపించుకోవాల్సి వచ్చింది. “నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ తోనే ఉంటాను. సోషల్ మీడియా నేనే నిర్వహిస్తున్నాను, అండగా ఉంటాను” అంటూ చెప్పుకున్నారు. అంటే జగన్ పై, పార్టీపై ప్రేమను, ఆప్యాయతని ఆయన స్వీయ నిరూపణ చేసుకున్నారు. ఇది ఊహించని పరిణామం. ఆ పార్టీలో, ప్రత్యర్థుల్లో ఇది గట్టి చర్చకే దారితీసింది. కానీ అసలు ఏం జరిగింది? అనేది మాత్రం ఎవరికీ తెలియదు, ఎవరి ఊహకు అందదు.
ఈ బంధం ఈనాటిది కాదు…!
జగన్ – విజయసాయిల బంధం ఈ నాటిది కాదు. వైఎస్ ఉన్నప్పటి నుండి ఇద్దరూ ఒకరికొకరు క్లోజ్. అందుకే అప్పటి కేసుల్లో ఇద్దరూ కలిసి జైలుకి వెళ్లారు. ఆ జైలులోనే వీరి బంధం రాజకీయ అడుగులవైపు మళ్లింది. “మనం జైలులో ఉండడానికి కారణం చంద్రబాబు, కాంగ్రెస్, సోనియా” ఈ ఎవ్వరినీ రాజకీయంగా ఎదగనీయకూడదు అంటూ నాడు చర్చలు జరిగేవి. అలా ఇద్దరూ కలిసి జైలు జీవితంలోనే రాజకీయ వ్యూహాలు వేసే వారు. బయట ఉన్న వైవీ సుబ్బారెడ్డి, షర్మిల, సజ్జల, భారతిరెడ్డి ద్వారా వాటిని అమలు చేసే వారు. అంటే జగన్ కి అత్యంత ప్రీతీ పాత్రుడు విజయసాయి మాత్రమే. సొంత బాబాయి వైవిని కాదని, విజయసాయికే జగన్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆయన వ్యూహాలనే అమలు చేస్తుంటారు.
జగన్ అధికారంలోకి రావడంలో విజయసాయి పాత్ర స్పష్టం…!
టిడిపిలో నంబర్ టూ అంటే లోకేష్.. కానీ టీడీపీకి లోకేష్ మైనస్. పెద్ద మైనస్… కానీ వైసిపిలో నంబర్ టూ అంటే విజయసాయిరెడ్డి. ఈయన పార్టీకి పెద్ద ప్లస్. తెలివి, రాజకీయ వ్యూహాలతో పార్టీలో జగన్ నీడగా చక్కగా నడిపారు. పార్టీ 2014 లో ఓడిన తర్వాత సోషల్ మీడియాని బలోపేతం చేయడం.., ఎక్కడో ఉన్న పీకే ని తీసుకొచ్చి జగన్ కి పరిచయం చేయడం.., సోషల్ మీడియా కార్యకర్తలకు శిక్షణ ఇప్పించడం… నాయకులతో తరచూ సంప్రదింపులు జరపడం… టిడిపిలో గట్టి వారిని తమ పార్టీలోకి లాగడం… ఢిల్లీలో బిజెపి పెద్దలతో వైసీపీ తరపున బంధం ఏర్పడేలా చేయడం… జగన్ ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం… ఇలా అన్ని విభాగాల్లోనూ విజయసాయి కీలకంగా పని చేశారు. అటువంటి వారికి ఈ పరిస్థితి, స్వీయ నిరూపణ రావడం కాస్త ఆలోచనలు, చర్చను రేకెత్తిస్తుంది. నిజమే వైసిపిలో విజయసాయి అంటే “సోషల్ మీడియాలో టీడీపీ ని ఆడుకుంటారు .., ఢిల్లీలో చక్రం తిప్పుతారు” అని మాత్రమే తెలుసు. అటువంటిది కొత్తగా “నేను జగన్ తో ఉంటాను, ఊపిరి ఉన్నంత వరకు జగన్ వెన్నంటే ఉంటాను” అని చెప్పుకోవాల్సి వస్తుందని ఏనాడూ ఊహించి ఉండరు. అందుకే ఈ చర్చ, ఈ రచ్చ.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?