Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి రావటంపై అనేక రాజకీయ ఊహాగానాలు సాగుతున్నాయి.వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం కోసం బీజేపీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో యోగి హుటాహుటిన ఢిల్లీకి వచ్చారంటున్నారు.
బీజేపీ సంస్థాగత జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ ఇటీవల ఉత్తర్ ప్రదేశ్లో పర్యటించి ,వివిధ వర్గాలను కలిసి పార్టీ పరిస్థితిపై ,ప్రభుత్వం మీద ప్రజలకున్న అభిప్రాయాల మీద ఒక రహస్య నివేదికను తయారు చేసి పార్టీ అధిష్టాన వర్గానికి అందజేసినట్లు సమాచారం.ఏడాదిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉత్తర్ప్రదేశ్లో ఇంకా పార్టీ పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు అంటున్నారు.ఇందులో ఆయన ముఖ్యంగా కొన్ని పాయింట్లను పేర్కొన్నారు. వాటిలో కొన్ని ఏమిటంటే!
పంచాయితీ ఎన్నికల్లో వెనుకంజ!
ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీ వెనుకబడింది.ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్ వాదీ పార్టీ మొదటి స్థానాన్ని దక్కించుకోగా రెండో స్థానానికి బీజేపీ పరిమితమైంది.చివరకు ముఖ్యమంత్రి యోగి సొంత నియోజకవర్గమైన గోరఖ్పూర్ లో కూడా బీజేపీ దారుణంగా దెబ్బతిన్నది.ఇది పార్టీ అగ్రనాయకత్వానికి ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.
కోవిడ్ అదుపుచర్యల్లో వైఫల్యం!
ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కరోనాను అదుపుచేయటంలో యోగి ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇది ఎవరో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కాదు.ఏకంగా కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ఈ విషయమై ముఖ్యమంత్రి యోగికి లేఖ రాశారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బరేలీ నియోజకవర్గం లో పరిస్థితి దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు.అధికారులు పనిచేయడం లేదని, ఆస్పత్రిలో బెడ్లు లేవని, మందులు,ఆక్సిజన్ కొరత ఉందని ఆయన సీఎం దృష్టికి తెచ్చారు.రామ్ గోపాల్ లోధీ అనే బిజెపి ఎమ్మెల్యే తన భార్యకే ఆగ్రా హాస్పిటల్లో బెడ్ ఇవ్వలేదని సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. యూపీ న్యాయశాఖమంత్రి బ్రిజేష్ పథక్ కూడా కరోనా విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని వివరిస్తూ ఒక రహస్య లేఖను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కి పంపినట్టు సమాచారం.
Yogi Adityanath: అగ్ర నేతలతో యోగి వరుస భేటీలు
ఈ నేపధ్యంలో సీఎం యోగి గురువారం నాడు అనూహ్యంగా ఢిల్లీ చేరుకుని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలతో వరుసగా భేటీ అవుతుండడంతో ఊహాగానాలు తారస్థాయికి చేరుకున్నాయి.హోం మంత్రి అమిత్ షాను యోగి కలిసి మంతనాలు జరిపారు.బిజెపి అధ్యక్షుడు నడ్డాను కూడా ఆయన కలవాల్సి ఉండగా ఈలోపు నడ్డా ప్రధాని మోడీతో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో ఏదో జరగబోతోందన్న సంకేతాలు వస్తున్నాయి.