గత కొంత కాలంగా తన సినిమాలతో నిరాశపరుస్తున్న హీరో రవితేజ ‘క్రాక్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అయ్యాడు. ఇదివరకు రాజాధి గ్రేట్ చిత్రంతో కమర్షియల్ హిట్ ని సొంతం చేసుకుంది. కాని అదే ఊపుతో తర్వాత తీసిన నేలటికెట్, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా.. సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి ప్రేక్షకులను నిరాశపరిచాయి.
ఇలా వరుస ఫ్లాపులతో ఉన్న మాస్ మహరాజ ఈ సారి మాత్రం పక్కా ప్లాన్తోనే ఉన్నాడట. ఈ క్రమంలోనే ఇంతకుముందు రవితేజకు ‘డాన్ శీను’ ‘బలుపు’ లాంటి హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు. ఒంగోలులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాడట గోపిచంద్ మలినేని.
కాగా ఈ సినిమా సక్సెస్ మీద రవితేజ, గోపిచంద్ మలినేని, శృతిహాసన్ చాలా నమ్మకం పెట్టుకున్నారని తెలుస్తుంది. ఇదివరకే రవితేజ, దర్శకుడు గోపిచంద్ కాంబోలో వచ్చిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో, మరోసారి ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖనీ ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో కనిపించడం విశేషం. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ పాత్ర వైస్సార్సీపీ మాజీ ఎంపి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గోరుంట్ల మాధవ్ ని పోలి ఉంటుందని సమాచారం.
రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్తో రాక్షసుడు సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు రమేష్ వర్మ తో రవితేజ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుండగా, ఇస్మార్ట్ శంకర్ తో ఫాం లోకి వచ్చిన నిధీ అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే నభా నటేష్ స్థానంలో రాశి ఖన్నాను ఎంచుకున్నట్టు తాజా సమాచారం. కాగా గతంలో రవితేజ, రాశి ఖన్నా కాంబినేషన్ లో బెంగాల్ టైగర్ వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది.
ఆ తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు యావరేజ్ సినిమాగా మిగిలింది. అయినప్పటికి మరోసారి రవితేజ రాశీ ఖన్నా కాంబినేషన్ రిపీటవుతుంది. ఇక ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారట. ఇదే కాకుండా ఈ చిత్రంతో పాటు నేను లోకల్ ఫేం త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమాకు రవితేజ కమిట్ అయ్యాడట. మాస్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా రూపొందనుండగా మెగాస్టార్ చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమా కథ ఇన్స్పిరేషన్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం.