రాఫెల్ ఒప్పందంతో జరిగిన మేలేమిటని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రాన్ని నిలదీశారు.లోక్ సభలో ఈ రోజు రాఫెల్ ఒప్పందంపై ఆయన మాట్లాడారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాఫెల్ చర్చ వేడివేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. లోక్ సభలో ఈ రోజు జరిగిన చర్చలో గల్లా జయదేవ్ కేంద్రంపై ఫైర్ అయ్యారు.
ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని విమర్శించారు. 2014 మార్చిలో జరిగిన ఒప్పందాన్ని పూర్వపక్షం చేసి ఆ మరుసటి ఏడాది ప్రధాని మోడీ ఏకపక్షంగా రక్షణ మంత్రి ఆమోదం లేకుండానే ఫ్రాన్స్ లో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందానికీ, మోడీ హయాంలో జరిగిన ఒప్పందానికీ తేడా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ హయంలో జరిగిన ఒప్పందం వల్ల దేశానికి అదనంగా ఒనగూరిన మేలు, ప్రయోజనం ఏమిటో చెప్పాలని పట్టుపట్టారు. రాఫెల్ పై ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.