ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గత కొద్దికాలంగా దళితుల అంశంపై విమర్శలు చేస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ నేత మేరుగ నాగార్జున తాజాగా స్పందించారు.
“వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళితులు గుండె మీద చేయి వేసుకుని ప్రశాంతంగా, ధైర్యంగా బతుకుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే.. ఇది మా ప్రభుత్వం, ఇది దళితుల పక్షపాతి ప్రభుత్వం అని దళితులు అంటున్నారు. ఇంత కాలానికి దళితుల బాగుకోరే ప్రభుత్వం వస్తే.. చంద్రబాబు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు“ అని మండిపడ్డారు.
దళితుల మధ్య చిచ్చు పెట్టే…
అంతర్వేదిలో మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి ఇప్పుడు కొత్త గళం ఎత్తుకున్నారని నాగార్జున ఆరోపించారు. “అంతర్వేది ఘటనపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే… ఆ వెంటనే, కొన్ని గంటలు కూడా గడవకుండానే ఈరోజు దళితుల మధ్య చిచ్చు పెట్టాలని శంఖారావం అంటున్నావు. దీన్ని దళితుల మీద ప్రేమ అంటారా.. దళితుల్లో చిచ్చు పెట్టడం అంటారా..?“ అంటూ నాగార్జున ప్రశ్నించారు.
గతంలో ఏం జరిగింది చంద్రబాబు?
గతంలోనూ చంద్రబాబు హయాంలో విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ బయటకు వస్తే.. ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని పారిపోయాడని నాగార్జున గుర్తు చేశారు. “అధికారంలో ఉన్న ఐదేళ్ళలో ఏరోజు అయినా అంబేద్కర్ విధానాలను గౌరవించావా..? అంబేద్కర్ ఆలోచనల ప్రకారం దళితులను గౌరవించావా..? అంటే లేదు. అధికారం పోయే సరికి ఈరోజు అంబేద్కర్ గుర్తొచ్చాడా చంద్రబాబూ..?“ అంటూ ప్రశ్నించారు.
వైఎస్ కుటుంబం అంటేనే….
“వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మానవత్వం, ప్రేమకు విలువనిచ్చే మంచి మనుషులు. అటువంటి కుటుంబాన్ని ఫ్యాక్షనిస్టులని, ఉన్మాదులని మాట్లాడటానికి నోరు ఎలా వస్తుంది చంద్రబాబూ? ఉన్మాదులంటే చంద్రబాబు వలే ఉంటారు. రాక్షసులంటే చంద్రబాబు లాగానే ఉంటారు అన్నది ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. – దళితుల సంక్షేమాన్ని భుజాన వేసుకుని.. దళితులను మామ అని పిలిచే కుటుంబం వైయస్ రాజశేఖరరెడ్డిగారి కుటుంబం. ఇటువంటి కుటుంబాన్ని దళితులు ఎప్పటికీ వదులుకోరు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా.. అనే చంద్రబాబును దళితులు ఎప్పటికీ నమ్మరు.“ అని క్లారిటీ ఇచ్చారు.
నువ్వు సిద్ధమా చంద్రబాబు?
“ ఎవరి హయాంలో దళితుల మీద దాడులు జరిగాయి, ఎవరి హయాంలో దళితులు దగా పడ్డారు… అన్న అంశాలపై కూలంకుషంగా చర్చించటానికి మేం సిద్ధంగా ఉన్నాం. డేట్, టైమ్ మీరే చెప్పండి. ఏ వేదిక మీద చర్చిద్దామంటే ఆ వేదిక మీద చర్చిద్దాం. దళితుల మీద లేని ప్రేమను ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేసినంత మాత్రాన దళిత జాతి నమ్మదు కాక నమ్మదు చంద్రబాబూ. “ అని సవాల్ విసిరారు.