వైఎస్ఆర్సిపి ముఖ్యనేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మీడియాతో మాట్లాడుతున్నారంటే అందులో సంచలనాలే ఉంటాయి. తనదైన శైలిలో చేసే ప్రత్యేక కామెంట్లకు సైతం కొడాలి నాని పెట్టింది పేరు.
తాజాగా మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి వివిధ పరిణామాలపై ఆయన స్పందిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆయన విరుచుకుపడుతుంటారు. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో పోటీ చేయను
గుడివాడలో ప్రజలలో నాడు, ప్రజల కోసం నేడు పాదయాత్ర నిర్వహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చంద్రబాబు, టీడీపీ నాయకులపై విరుచుపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, అతని అనుచరులను జగన్నాథ రథ చక్రాల కింద నల్లిని నలిపినట్లు నలిపేస్తామని మంత్రి అన్నారు. నా ఇల్లు, నా సొంతం అంటూ ఓడిపోయిన టిడిపి నాయకులందరూ రోడ్లు ఎక్కి షో చేస్తున్నారని, చంద్రబాబు కు దమ్ము ఉంటే గుడివాడ వచ్చి ఒక్క ఇల్లు అయిన ఇచ్చి చూపించాలని సవాల్ చేశారు. గుడివాడలో 25 వేల మంది లబ్ధిదారులకు, 2024 లోపు ఇల్లు కట్టించి ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన అన్నారు.
ఏంటి కొడాలి ధైర్యం ?
కొడాలి నానిది ప్రత్యేకమైన రాజకీయ విధానం. దూకుడుగా వెళ్తారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ సహా బాబు కోటరీపై అంతెత్తున ఫైర్ అవుతారు. చంద్రబాబు సహా టీడీపీలో తనకు గిట్టని వారిని ఓ రేంజ్లో టార్గెట్ చేస్తుంటారు. వైసీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొడాలి నానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో తనకు అప్పగించిన బాధ్యతల ప్రకారం తన గళాన్ని నాని మరింత వినిపిస్తున్నారు.