నూతన్ నాయుడు వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి జనసేననే చుట్టుకుంటోంది ! జనసేనాని పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నూతన్ నాయుడు తన ఇంట్లో పనిచేసే ఒక దళిత యువకుడికి శిరోముండనం చేసిన విషయం తెలిసిందే.
ఇది రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారాక జనసేన పార్టీ నూతన్ నాయుడుకి తమకు సంబంధం లేదని ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో జనసేనకు ముడిపెడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కూడా జనసేన హెచ్చరించింది. ఓ రకంగా చెప్పాలంటే నూతన్ నాయుడుని పవన్ కల్యాణ్ పార్టీ ,అభిమానులు వదిలించుకున్నారు.అయితే నూతన నాయుడు గతం<తెలిసిన వారు అతడికి పవన్ కల్యాణ్ కి జనసేనకు సంబంధం లేదంటే నమ్మరు.
ఈ మధ్య రామగోపాల వర్మ తనదైన శైలిలో పవన్ కల్యాణ్ను ఉద్దేశించి పవర్ స్టార్ అంటూ ఒక షార్ట్ ఫిల్మ్ దీస్తే దానికి కౌంటర్గా ఇదే నాయుడు పరాన్న జీవి అని మరో కళాఖండం తీసి వదిలాడు.ఆ పరాన్న జీవిని ప్రమోట్ చేసింది పవన్ కల్యాణ్ అభిమానులు.. జన సైనికులే ..చివరకు పరాన్న జీవిని ప్రసారం చేసిన ఛానల్ కూడా పవన్ కల్యాణ్ సొంతానిదే(99టివి).
తాజాగా “అసలు ఆగష్టు సంక్షోభం ఆరంభం …ఇక పవన్ కళ్యాణ్ పాత్ర ప్రారంభం..’ అంటూ ఇదే నూతన్ నాయుడు పేరుతో ఉన్న ఒక ఫేస్ బుక్ అకౌంట్లో ఈ నెల ఎనిమిదో తేదీన ఒక పోస్టు ప్రత్యక్షమైంది.ఇక రాష్ట్ర రాజకీయాల్లో పవన్ శకం ప్రారంభమైందనది ఆ పోస్ట్ సారాంశం. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులు విపరీతంగా లైక్ చేశారు. ఇన్ని మాటలెందుకు నూతన్ నాయుడు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్వీరాభిమాని ..జనసేన మద్దతుదారుడే! ఆయితే పెద్ద వివాదంలో ఇప్పుడు చిక్కుకున్న నూతన నాయుడుని ఆ పార్టీ దూరంగా పెట్టింది.
ఇప్పుడు జనసేన పార్టీ తమకూ నూతన్ నాయుడుకు సంబంధం లేదని చెప్పవచ్చు! అయితే ఆయన తీసిన కళాఖండం పరాన్నజీవి పరిస్థితి ఏమిటి? ఏం… అప్పుడు చెప్పలేదే మాకూ నూతన్నాయుడుకూ సంబంధం లేదని పవన్ కల్యాణ్ వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు .అప్పుడు అలివిగాని రీతిలో ప్రమోట్ చేసి, ఆగస్టులో సంక్షోభాలు పుట్టేస్తాయని పలికి.. ఆ అతితోనే తీరా ఇరుక్కున్నాకా.. సంబంధం లేదంటే ఎలా అని వారు నిలదీస్తున్నారు.మొత్తం మీద నూతన్ నాయుడు జనసేన కి తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది!