ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికలు ,ఉప ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో కూడా కాషాయ జెండా రెపరెపలాడాలన్న ప్రణాళికతో సంస్థాగతంగా పార్టీని పునరునిర్మించింది. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై దృష్టి పెట్టింది.
ఇందులో భాగంగా అనేక రాష్ర్టాల్లో పార్టీ ఇన్చార్జిలను మార్చేసింది.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ దియోధర్, తెలంగాణ ఇన్చార్జ్ సత్యకుమార్ లను కూడా మార్చటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుకోసం సత్యకుమార్ కూడా కష్టపడ్డారు .త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ఆయన సమాయత్తమవుతున్నారు.ఇక చాలాకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సునీల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు .పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన వంతు కృషి సలుపుతున్నారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకి కూడా ఆయన పార్టీని సంసిద్ధపరుస్తున్నారు.ఇలాంటి తరుణంలో వారిద్దరికీ చేదువార్త అందింది.ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ర్టాల పార్టీ ఇన్ ఛార్జులుగా ఉన్న ఆఇద్దరినీ డిమోట్ చేశారు.సునీల్ డియోధర్ స్థాయి తగ్గించి సహ ఇంఛార్జిగా ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగిస్తూ కొత్త ఇంఛార్జిగా మురళీధరన్ ను బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా నియమించారు.
అలాగే తెలంగాణ పార్టీ పగ్గాలను తరుణ్ చుగాకు అప్పగించారు.ప్రస్తుత ఇంచార్జ్ సత్య కుమార్ ను ఉత్తరప్రదేశ్ కు సహ ఇంఛార్జిగా పంపారు.ఏక కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ ఇన్ ఛార్జులను మార్చి వారి స్థాయిని తగ్గించటం బిజెపిలోనే చర్చనీయాంశమైంది. కాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్టీఆర్ కుమార్తె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరికి మాత్రం టాప్ ప్లేస్ లభించింది .ఛత్తీస్గఢ్ ఒడిషా రాష్ట్రాల పార్టీ ఇన్చార్జిగా ఆమెను నియమించారు. ఇకపోతే తెలంగాణ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన డీకే అరుణకు కర్ణాటక రాష్ట్ర సహ ఇన్చార్జి హోదా లభించింది.మరో తెలంగాణ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి తమిళనాడు సహ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ర్టాల పార్టీ ఇన్చార్జిల మార్పు మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.