కరోనా కేసులు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అనేక రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. కేరళలో పలు చోట్ల ట్రిపుల్ లాక్ డౌన్ అమలు చేశారు. దీంతో కర్ణాటకలోని బెంగళూరులోనూ అదే తరహా లాక్డౌన్ అమలు చేయనున్నారు. అయితే ఇంతకీ అసలు ట్రిపుల్ లాక్ డౌన్ అంటే ఏమిటి ? దాంతో ఏమైనా ప్రయోజనం ఉంటుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
కేరళలోని తిరువనంతపురంలో జూలై 6 నుంచి ట్రిపుల్ లాక్డౌన్ అమలు చేశారు. పోలీసులు, ఇతర సిబ్బంది సమన్వయంతో.. ముందస్తు ప్రణాళిక, వ్యూహాలతో లాక్డౌన్లు వారు కట్టుదిట్టంగా అమలు చేశారు. దీంతో అక్కడ 3 వారాల్లో 94 శాతం కేసులు తక్కువగా నమోదయ్యాయి. ఏప్రిల్లో కేరళలోని కసరగొడ్లో మొదటగా ట్రిపుల్ లాక్ డౌన్ విధించారు. తరువాత ఆ రాష్ట్రంలో పలు చోట్ల దీన్ని అమలు చేస్తున్నారు. దీని వల్ల కేవలం 21 రోజుల్లోనే 94 శాతం కరోనా కేసుల సంఖ్య తగ్గిందని అక్కడి అధికారులు వెల్లడించారు.
ట్రిపుల్ లాక్డౌన్లో భాగంగా పోలీసులు కార్లు తిరగలేని చోట్ల మోటార్సైకిళ్లతో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించారు. పూర్తిగా నిఘా పెట్టారు. షాపుల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని సమీపంలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూంకు కనెక్ట్ చేశారు. కంటెయిన్మెంట్ జోన్లలో ఉండే వారి కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. దాని సహాయంతో వారి భౌగోళిక కదలికలపై నిఘా పెట్టారు. ఆ యాప్లో ఎమర్జెన్సీ కోసం ఓ ఎస్వోఎస్ బటన్ను కూడా ఏర్పాటు చేశారు. అవసరం ఉంటే ప్రజలు ఆ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా అత్యవసర సేవలను పొందవచ్చు.
ట్రిపుల్ లాక్ డౌన్ పేరుకు తగినట్లే మూడు స్టేజిల్లో ఉంటుంది.
* మొదటి స్టేజిలో ఒక జిల్లాలో ఉన్న ప్రజలందరి కదలికలపై నిషేధం ఉంటుంది. ఎవరూ ఆ జిల్లాలోకి వెళ్లకూడదు. అక్కడి నుంచి బయటకు రాకూడదు.
* రెండో స్టేజిలో కోవిడ్ 19 కేసులు నమోదైన చోట్ల లాక్డౌన్ ఉంటుంది. అక్కడి నుంచి ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకుండా చూస్తారు.
* మూడో స్టేజిలో కరోనా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తుల ఇండ్లను పర్యవేక్షిస్తారు. వారు, వారి కుటుంబ సభ్యులు తమ ఇండ్ల నుంచి బయటకు రాకుండా చూస్తారు.
ఇలా మొత్తం 3 స్టేజిల్లో ట్రిపుల్ లాక్డౌన్ను కేరళలో అమలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే విధానాన్ని బెంగళూరు పాటించనుంది. మరో రెండు రోజుల్లో అక్కడ ట్రిపుల్ లాక్డౌన్ అమలు చేయనున్నారు. అయితే హైదరాబాద్లోనూ ప్రస్తుతానికి కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించే ఆలోచనలో లేదని స్పష్టమవుతోంది.