Pawan Kalyan: పవన్ భేటీ అంతరార్థం ఏమిటి..? కాపులకు కాపు కాస్తున్నట్టేనా..! అనే ప్రశ్నలు ఏపీలో మొదలయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఇందుకు కారణం రాజకీయాలే. ఉమ్మడి ఏపీలో కమ్మ, రెడ్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దశాబ్దాల ఏలిక ఆయా కులాల సొంతమైంది. ప్రస్తుతం ఏపీలో రెడ్డి సామాజికవర్గానికే చెందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెడ్లకు వైసీపీ, కమ్మకు టీడీపీ అనధికార పార్టీలుగా ఉన్నాయి. అయితే.. కాపులకు మాత్రం ఇంతవరకూ రాజ్యాధికారం దక్కలేదు. కారణం.. కాపుల్లో ప్రజాబలం, మాస్ ఇమేజ్ ఉన్న నాయకులు లేక కాదు. వారి ఎదుగుదల సమయంలో ఐకమత్యం లేకపోవడం ఒక కారణమైతే.. రాజీకీయ క్రీడలో బలైపోవడం ఒక కారణం. ఇప్పుడితే అంశాల్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ Pawan Kalyan ప్రస్తావించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కాపు నాయకులతో జరిగిన సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కాపులకు ఎదురుదెబ్బలు..
గతం పరిశీలిస్తే.. మూడు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో బలమైన ఛరిష్మా ఉన్న కాపు నాయకుడిగా ఉన్న వంగవీటి రంగా ఆధిపత్యాన్ని అప్పటి రాజకీయ పరిస్థితులు బలిగొన్నాయి. ఆ తర్వాత రాజకీయాల్లో కాపుల ప్రాబల్యం తగ్గింది. ముద్రగడ పద్మనాభం ఉన్నా ఆయన కాపులను బీసీల్లో చేర్చాలనే నినాదానికే మిగిలిపోయారు తప్ప.. కాపులకు దిక్సూచిగా ఉండలేకపోయారు. తర్వాత పుష్కర కాలం తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి కాపులకు వెలుగు చుక్కలా మారారు. కానీ.. సినిమాల్లో అప్రతిహతమైన మాస్ ఇమేజ్, చరిష్మాతో ప్రజలందరితో అందరివాడు అనిపించుకున్న చిరంజీవి కేవలం కాపులకు నాయకుడు కాలేకపోయారు. పైగా.. రాజకీయ ముప్పేట దాడికి ఆయన కూడా బలైపోయారు. దీంతో కాపులకు మళ్లీ నిరాశే మిగిలింది. కాపులే ఆయనకు కాపు కాయకపోవడం ఆ వర్గంలో నిలకడలేమికి ఉదాహరణగా నిలిచింది. దీంతో కాపులు మళ్లీ ఒకరి పంచన చేరాల్సిన పరిస్థితులే వచ్చాయి.
కాపులకు రాజకీయ పార్టీలు చేసింది ఇదేనా..?
రాజకీయంగా దశాబ్దాలుగా కాపులను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్, టీడీపీలు చూశాయి. 1994లో కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ దీక్ష చేస్తే సరే అంది కాంగ్రెస్. తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆ విషయం మరుగున పడిపోయింది. 2004లో కాపులను బీసీల్లో చేరుస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టింది. అది ఎన్నికల ప్రచార అస్త్రంగా మాత్రమే ఉండిపోయింది. 2014లో చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్తామని కాపులు మర్చిపోయిన విషయాన్ని లేవనెత్తారు. దీంతో ముద్రగడ ఆధ్వర్యంలో ఉద్యమం మొదలైతే తుని ఘటనతో మళ్లీ వెనక్కు వెళ్లిపోయింది. అయితే.. రాజకీయ ప్రాపకం కోసం చట్టాలు సహకరించవని తెలిసినా కాపులకు 5శాతం రిజర్వేషన్ అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపించారు. అది ఎక్కడుందో, ఏమైపోయిందో ఇప్పటికీ తెలీదు. చంద్రబాబు కాపులకు చేసింది మోసమని.. కాపులకు తాను రిజర్వేషన్ కల్పించలేనని కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలోనే ధైర్యంగా చెప్పేశారు. అయినా.. అదే తూర్పు గోదావరి జిల్లా ప్రజలు 2019లో జగన్ కు అత్యధిక సీట్లు కట్టబెట్టారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ వంతు వచ్చింది.
కాపులకు పవన్ దిక్కయ్యేనా..?
పవన్ కల్యాణ్.. ఏపీలో ప్రస్తుతం కాపు సామాజికవర్గం నుంచి బలమైన నాయకుడిగా ఉన్నారు.. 1930 నాటి పరిస్థితుల నుంచి ఆయన మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు కాపు కులస్థుడిగా చూస్తే.. కాపులను విభజించు పాలించు విధానంలో రాజకీయ నేతలు అప్పటినుంచే చూడటం ప్రారంభించారని అన్నారు. కాపు, బలిజ, ఒంటరి.. మధ్య విబేధాలు సృష్టించారని అన్నారు. మొత్తంగా కాపులకు రాజ్యధికారం రావాలనే అన్నారు. ప్రజారాజ్యం.. కాపుల కోసమే పుట్టకపోయినా కాపుల్లో బలమైన ఇమేజ్ ఉన్న వ్యక్తి పెట్టిన పార్టీ. జనసేన.. చిరంజీవి తమ్ముడిగానే కాకుండా సినిమాల ద్వారా అశేష ప్రేక్షకుల అభిమానం ఉన్న పవన్ కల్యాణ్ పెట్టిన పార్టీ. ఇప్పుడు కాపులకు పవన్ కల్యాణ్ మాత్రమే వెలుగుచుక్కలా కనిపిస్తున్నారు. అందుకే.. కాపుల్లోని పెద్దలు అందరూ పవన్ వద్దకు చేరారు. నిజానికి ఎక్కువగా కమ్మ వర్గం టీడీపీకి, రెడ్ల వర్గం వైసీపీకి ఓట్లేసినట్టు.. కాపులు మొన్న ప్రజారాజ్యంకు, నిన్న జనసేనకు ఓట్లు వేయలేదు. రేపు ఓట్లు వేయాలంటే తాను కాపులకు వెలుగుదివ్వెనే అని పవన్ నిరూపించుకోవాలి. పవన్ కల్యాణ్ కాపు వ్యక్తే అయినా.. ఆయనకు ఆ పట్టింపు ఉండదు. కానీ.. కాపులు సహకరిస్తే.. ఆయనకు ఉన్న ప్రజాభిమానం తోడై వారు కోరుకుంటున్న రాజ్యాధికారం దక్కడానికి పెద్దగా సమయం అక్కర్లేదు.