Nurses: ఐదు నిమిషాల వ్యవధిలో ఒకే మహిళకు కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ వేసేసి నర్సులు తమ ప్రావీణ్యం ప్రదర్శించారు.ఈ అరుదైన సంఘటన బీహార్ లో జరిగిందని ఇండియా టుడే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.అయితే ఆయుష్ గట్టిది కావడంతో ఆ మహిళకు ప్రాణాపాయం వాటిల్లలేదు. నర్సుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచే ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
అసలేం జరిగిందంటే!
బీహార్లోని రూరల్ పాట్నాజిల్లా లోని పుంపున్ బ్లాక్ లో ఈ నెల పదహారవ తేదీన ఈ సంఘటన జరిగింది.సునీలా దేవి అనే మహిళ వ్యాక్సిన్ తీసుకోవడం కోసం రిచాక్ గ్రామంలోని ఒక స్కూల్ కు వచ్చింది.ఆమె వివరాలు నమోదు చేసుకున్న అనంతరం ఒక నర్సు ఆమెకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్ వేసింది. ఈ రియాక్షన్ వస్తుందేమో పరీక్షించడానికి కొద్ది సేపు వేచి ఉండాల్సిందిగా అధికారులు సలహా ఇవ్వడంతో ఆమె ఆ వ్యాక్సిన్ కేంద్రంలోనే ఒక గదిలో కూర్చుంది. ఐదు నిమిషాలు గడవకముందే మరో నర్సు వచ్చి ఆమెకు కోవ్యాక్సిన్ వేసేసింది.అయితే తనకు అప్పటికే వ్యాక్సిన్ వేసినట్టు ఆ మహిళ సదరు నర్సుకు చెప్పుకున్నప్పటికీ ఆమె వినలేదు.పైగా ఒకేసారి రెండు డోసులు ఇవ్వాలంటూ తన పైత్యం ప్రదర్శించింది.
అప్రమత్తమైన అధికారులు:నర్సులకు నోటీసులు
కాగా ఆ మహిళ జరిగిందంతా వ్యాక్సినేషన్ కేంద్రం అధికారులకు వివరించడంతో వారే బిత్తరపోయారు. ఆ వెంటనే అప్రమత్తమయ్యారు.వెంటనే అబ్జర్వేషన్ రూమ్ కి ఆమెను తరలించి రెండు రోజుల పాటు అక్కడే ఉంచుకున్నారు.అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు.రియాక్షన్స్ గోచరించలేదు.దీంతో ఆమెను శుక్రవారం ఇంటికి పంపారు.అయితే ఆమె ఈ విషయాన్నంతా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో విషయం జిల్లా కలెక్టర్ దాకా వెళ్లింది.ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ఇద్దరు నర్సులను రాష్ట్ర వైద్య శాఖ అధికారులు ఆదేశించారు.ఇది పూర్తిగా నిర్లక్ష్య పూరిత చర్య అని ఒక అధికారి వ్యాఖ్యానించారు.ఆ నర్సులు ఒక అమాయకురాలి ప్రాణాలతో చెలగాటమాడారని ఆయన అన్నారు.వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.