మార్కెటింగ్ సదుపాయాలు అభివృద్ధి చెందని రోజుల్లో గ్రామాల్లో సంతలు ప్రధాన వ్యాపార కేంద్రాలుగా ఉండేవి. ఇప్పటికీ కొన్ని చోట్ల వాటి ఆదరణ ఇంకా తగ్గలేదు. మరికొన్ని చోట్ల ఈ సంతలు కొత్తపుంతలు తొక్కుతూ హైటెక్ హంగులు సంతరించుకుంటున్నాయి. కామారెడ్డి జిల్లాలోని వారాంతపు సంత మామూలు సంతల అక్కడ కూడా నిత్యావసర సరుకులు, గొర్రెలు, బర్రెలు దొరుకుతాయి అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అది అచ్చంగా వాహనాల అంగడి. ఇక్కడ అన్ని కంపెనీల పాత టూవీలర్లు, కార్ల క్రయ విక్రయాలు చేస్తుంటారు. ఎవరికి నచ్చిన వాహనాన్ని వారు బేరం ఆడి మరి కొనుగోలు చేసుకోవచ్చు.
ఇంకో ఆశ్చర్యపోయే విషయమెంటంటే ఈ సంతలో ప్రతివారం లక్షల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. కామారెడ్డి చుట్టుపక్కల ఈ సంత బాగా ప్రాచుర్యం పొందింది. దూరప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా వినియోగదారులకు సంబంధించిన గుర్తింపు కార్డులు, పూర్తి డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. చోరీ వాహనాలకు ఆవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియను చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు వంద మంది ఈ వాహనాల సంతపై ఆధారపడి జీవిస్తున్నారు. మున్సిపాలిటీకి ఫీజు చెల్లిస్తూ కమిషన్ పద్ధతిలో క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నారు. వాహనాలను సంతలో విక్రయించడం ఇక్కడే చూస్తున్నామని అక్కడ స్థానికులు చెబుతున్నారు. కమీషన్ దోపిడీ లేకుండా ఈ విధమైన వ్యాపారం చాలా బాగుందని వారు అంటున్నారు. ఇలాంటి సంతలు అన్ని చోట్లా ఉండాలని కోరుకుందాం.