Ys Sharmila : వైఎస్ షర్మిల Ys Sharmila ప్రస్తుతం తెలంగాణలో పార్టీ లేదు, నాయకులు లేరు.. అజెండా లేదు. వైఎస్ అభిమానులే ఆమె క్యాడర్, నడిపిస్తోంది వారే. జూలై 8 వైఎస్ జయంతి రోజున పార్టీ పేరు ప్రకటించబోతున్నారు. ఈలోపు ఆమె తెలంగాణ ప్రజల్లో ఇంపాక్ట్ చూపాలి.
అందుకే డైరక్ట్ గా టీఆర్ఎస్ ప్రభుత్వాన్నే అటాక్ చేశారు.. చేస్తున్నారు. విద్యార్ధుల సమస్యలు, నిరుద్యోగం, ఉద్యోగాల నోటిఫికేషన్ అంశాలను తీసుకుని 72 గంటల దీక్ష మొదలెట్టారు. సహజంగానే మీడియా కవరేజ్, ప్రజల్లో ఉనికి వచ్చాయి. మీడియా అటెన్షన్ కోసం పాదయాత్ర, పోలీసులు భగ్నం చేయడం, ఆమెకు గాయం కావడం, మళ్లీ.. ఇంటివద్దే దీక్ష చేసి విరమించడం జరిగింది. అయితే.. దీని వల్ల ఆమె సాధించింది ఏంటనే ప్రశ్న అయితే ఉంది.
దీక్ష అయితే చేశారు కానీ.. ప్రభుత్వం నుంచి హామీ లేదు. విద్యార్ధులు వచ్చి మద్దతిచ్చింది లేదు. దీక్ష విరమించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణకై పిలుపివ్వడం కానీ.. కార్యాచరణ ప్రకటించడం కానీ చేయలేదు. కేవలం ఆమె ఐడెంటిటీ కాపాడుకోవడానికి, పొలిటికల్ మైలేజీ పెంచుకోవడానికి మాత్రం ఉపయోగపడిందని చెప్పాలి. మీడియా ముందు చెప్పిన డైలాగులు పేలాయి. దీంతో తెలంగాణలో షర్మిల పార్టీపై ప్రజల్లో చర్చ జరగాలి. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల్లో తనపై నమ్మకం కలిగించుకోవడంలో ఇది మొదటి అడుగుగా ఉపయోగపడింది. ప్రభుత్వంపై డైరక్టుగా విమర్శలు చేస్తున్నా ఇప్పటికైతే.. టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం స్పందించింది లేదు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి నుంచి.. ఆమె సొంతంగా సాధించిన పాపులారిటీ సామాన్యమైంది కాదు. జగన్ జైలుకు వెళ్లిన సందర్భంలో ‘జగనన్న వదిలిన బాణం’ అని.. 2019 ఎన్నికల ప్రచారంలో ‘బై.. బై.. బాబు’ అని ఆమె ఎత్తుకున్న నినాదం.. జగన్ సీఎం అయ్యేందుకు దోహదపడింది. ఇంతటి సెల్ఫ్ ఐడెంటిటీ సాధించిన షర్మిలకు తెలంగాణలో సొంతంగా నిలబడటం, బలపడటం కష్టమేమీ కాదు. మాటలో, బలంగా నిలబడటంతో వైఎస్ వారసురాలని ఇప్పటికే నిరూపించుకున్నారు. కానీ.. ఇది రాజకీయం. ఆమె పార్టీ పెట్టిన తర్వాతే అసలు సిసలు పొలిటికల్ హీట్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.