చిరంజీవికి బీజేపీ ఏపీ చీఫ్ మెగా ప్రాధాన్యత వెనుక..
చిరంజీవి..పవన్ కలిస్తేనే బీజేపీ లాభమా
ఏపీలో రాజకీయ సమీకరణాల్లో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఏపీలో బీజేపీ..జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ గా కన్నా ఉన్న సమయంలోనే ఈ పొత్తు ఖరారైంది. కానీ, ఆయన ఏనాడు ఇలా చిరంజీవి వద్దకు వెళ్లి కలవలేదు. కన్నా తరువాత సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్ అయ్యారు. వెంటనే పవన్ కళ్యాణ్ ఆయనకు అభినందనలు తెలిపారు. వీర్రాజు ఆ తరువాత ఢిల్లీ వెళ్లారు. ఆయన అక్కడ ఉన్న సమయంలోనే మూడు రాజధానుల బిల్లులకు ఆమోదం లభించింది. ఇక, ఇప్పుడు ఢిల్లీ నుండి వచ్చిన తరువాత హైదరాబాద్ లో ఆయన తొలుత కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి నివాసాని వెళ్లి కలిసారు. ఈ రోజు తన మిత్రపక్ష పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసారు. అక్కడే సోము వీర్రాజు కొత్త చర్చకు తెర లేపారు. ఢిల్లీ బీజేపీ పెద్దల సూచనల మేరకే చిరంజీవిని కలిసారా అనేది ఇప్పుడు అటు బీజేపీ లో ఇటు జనసేన తో పాటుగా మెగా అభిమానుల్లోనూ ప్రధాన చర్చకు కారణమైంది. చిరంజీవితో భేటీ తరువాత సోము వీర్రాజు ఒక ట్వీట్ చేసారు. అప్పటికే మొదలైన అనేక సందేహాలకు..చర్చలకు ఈ ట్వీట్ వాటిని మరింతగా పెంచేసింది. ఇంతకీ..చిరంజీవితో సోము వీర్రాజు భేటీ..ఎటువంటి పరిణామాలకు దారి తీస్తోంది…
చిరంజీవి చెప్పింది చేస్తామంటూ..వీర్రాజు ట్వీట్
చిరంజీవికి బీజేపీతో ఎటువంటి సంబంధాలు లేవు. 2019 ఎన్నికల సమయంలోనే ఆయనను బీజేపీ ఆహ్వానించినట్లుగా..రాజ్యసభ ఎంపీ పదవి ఆఫర్ చేసినట్లుగా ప్రచారం సాగింది. అయితే, ప్రజారాజ్యం ఏర్పాటు ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనం..రాష్ట్ర విభజనతో చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే, ఆయన సోదరుడు పవన్ కళ్యాన్ జనసేన ఏర్పాటు చేసి ఎన్నికల్లోకి దిగినా.. నాగబాబు తోడుగా నిలిచారు కానీ, చిరంజీవి ఆసక్తి చూపించలేదు. ఇక, ఏపీలో బీజేపీ..జనసేన మధ్య మైత్రి ఉంది. ఇప్పుడు ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ వచ్చారు. ఆయన తనకు ఏపీ బాధ్యతలు అప్పగించినందుకు ఢిల్లీ వెళ్లి పార్టీ అధినాయకత్వాన్ని కలిసి వచ్చారు. ఆ తరువాత ఆయన హైదరాబాద్ వెళ్లి ముందుగా తన మిత్రపక్షంగా ఉన్న పవన్ ను కలవకుండా చిరంజీవిని కలవటం వెనుక అసలు ఉద్దేశం ఏంటనే చర్చ సాగుతోంది. సోము వీర్రాజు ఈ రోజు పవన్ కళ్యాణ్ ను కలిసారు. అయితే, చిరంజీవిని కలిసిన వెంటనే సోము వీర్రాజు చేసిన ట్వీట్ రాజకీయంగా మరింత ఆసక్తి కర చర్చలకు కారణమైంది. పార్టీ ని అభివృద్ధి చేయడంలో జనసేన పార్టీ అధ్యక్షుడు , మిత్రుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి @PawanKalyan సహాయసహకారాలు తీసుకొని ముందుకు వెళ్లమని ఆయన చేసిన సూచన మేము తప్పక పాటించి బీజేపీ-జనసేన పొత్తును ఆంద్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ శక్తిగా నిలుపుతాము…అంటూ సోము వీర్రాజు ట్వీట్ చేసారు.
చిరంజీవి…పవన్ నే బీజేపీ బలమా..
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉండి. కానీ, 2019 ఎన్నికల్లో జగన్ సునామీ ముందు ఆ అభిమానం నిలబడలేక పోయింది. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. జనసేన కేవలం ఒక్క సీటుకే పరిమితం అయింది. అయితే, ఏపీలో ఎన్నికల్లో గెలవాలంటే సామాజిక సమీకరణాలను పక్కాగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏపీలో టీడీపీ..వైసీపీలకు రెండు ప్రధాన వర్గాలకు చెందిన వారు మద్దతుగా ఉన్నట్లుగా చెబుతారు. దీంతో..బీజేపీ..జనసేన కాపు ఈక్వేషన్ ను తెర పైకి తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు కన్నా..ఇప్పుడ సోము వీర్రాజును నియమించటం వెనుక అదే ప్రధాన కారణంగా ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తమకు మిత్రుడుగా ఉన్నా..చిరంజీవిని సైతం తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తాజా పరిణా మాలు స్పస్టం చేస్తున్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలవటం పైన అభ్యంతరాలు లేకపోయినా..ఆయన తన సోదరుడితో కలిసి ముందుకు వెళ్లమని చెప్పటం.. ఆ సూచనలను తప్పక పాటిస్తామని వీర్రాజు ట్వీట్ ద్వారా చెప్పటంతో దీని వెనుక భారీ వ్యూహం ఉందనే చర్చ మొదలైంది. అయితే, బీజేపీ నుండి ఎంతో కాలంగా తనకు ఆహ్వానం ఉన్నా చిరంజీవి కాదని చెబుతన్న పరిస్థితుల్లో..తాను పవన్ తో కలిసి ముందుకు వెళ్లమని చెప్పటం ద్వారా తాను మాత్రం బీజేపీతో కలవననే విషయాన్ని చిరంజీవి పరోక్షంగా చెప్పినట్లే అనే వాదన వినిపిస్తోంది. కానీ, ఏపీలో ఎలాగైనా పట్టు సాధించాలని భావిస్తున్న బీజేపీ ప్రధానంగా ఈ మెగా బ్రదర్స్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుందా అనే చర్చ సైతం మొదలైంది. రానున్న రోజుల్లో రాజకీయంగా చోటు చేసుకొనే పరిణామాలే వీటన్నింటికీ సమాధానం చెప్పాలి.