ప్రకాశం జిల్లాలో టిడిపి ఎమ్మెల్యే ,మాజీ మంత్రి ,మాజీ ఎమ్మెల్యే తదితరులంతా జగన్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ వైసీపీ తీర్థం పుచ్చుకోగా అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు మాత్రం ప్రభుత్వంపై నిరసన స్వరం వినిపిస్తుండడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది.వైసిపి ఎమ్మెల్యేలు రోడ్డెక్కడం ప్రకాశం జిల్లాలో పరిపాటిగా మారింది.
నిన్నగాక మొన్న మాజీ మంత్రి కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేయటం తెలిసిందే.కందుకూరు నియోజకవర్గానికి మంజూరైన రక్షిత మంచినీటి బిల్లులు చెల్లించడం లేదంటూ ఆయన ఈ చర్యకు దిగారు.ఏకంగా జిల్లా పరిషత్ సిఇఓ ఎదుటే ఆయన బైఠాయించారు.చివరకు ఆయన బిల్లులను మంజూరు చేయించుకుని ఆందోళన విరమించారు.అంతకు ముందు మహీధర్రెడ్డి రెడ్డి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పై కూడా మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం ఇక్కడ గమనార్హం.మహీధరరెడ్డి విషయం ఇంకా మరుగున పడకముందే సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా బహిరంగ ఆందోళనకు దిగారు.శుక్రవారం ఆయన కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు.
తన నియోజకవర్గంలో అర్హులకు ఇళ్ల పట్టాలు మంజూరు కావడం లేదన్నది సుధాకర్ బాబు ఫిర్యాదు.అనర్హులకు ఇళ్ల పట్టాలు వస్తున్నాయని అర్హులకు న్యాయం చేయాలంటూ ఆయన కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.చివరకు కలెక్టర్ భాస్కర్ సర్దిచెప్పడంతో ఎమ్మెల్యే సుధాకర్ బాబు శాంతించినప్పటికీ ఆయన చర్య పార్టీ వర్గాలకు మింగుడు పడ్డంలేదు.అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి అవసరమైతే జిల్లా ఇంచార్జి మంత్రి లేదా ముఖ్యమంత్రి కో చెప్పుకుని సమస్యను పరిష్కరించుకోకుండా ఇలా రోడ్డెక్కడం సమంజసంగా లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇదే సమయంలో ప్రకాశం జిల్లా వైసిపి ఎమ్మెల్యేలు ఒకరి వెనుకగా ఒకరు బహిరంగ ఆందోళనలకు దిగుతుండడం వెనుక ఏమి కారణమై ఉంటుందని రాజకీయ పరిశీలకులు ఆరాధిస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లా మంత్రి, ముఖ్యమంత్రి బంధువు బాలినేని వాసు వైపు వేలు చూపుతున్నారు.తమ తమ నియోజకవర్గాల్లో మంత్రి వాసు జోక్యం వల్లే కందుకూరు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు ఇలా చేశారన్న సమాచారం ఉంది.
సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాలు కలిసే ఉంటాయి. ఈ నేపథ్యంలో సంతనూతలపాడు లో కూడా మంత్రి బాలినేని వాసు తన వర్గీయులకు ఎక్కువగా ఇళ్ల పట్టాలు మంజూరు చేయించుకున్నారన్న ఆక్రోశంతోనే ఎమ్మెల్యే సుధాకర్ బాబు రోడ్డెక్కారంటున్నారు. ఇక మాజీ మంత్రిగా తాను ఉన్నప్పటికీ కందుకూరు లో కూడా బాలినేని వాసు జోక్యాన్ని భరించలేక మహీధర్రెడ్డి బరస్ట్ అయ్యారని సమాచారం. వారి కోపం మంత్రి పైనే తప్ప ముఖ్యమంత్రి జగన్ పైన కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.