ఒకవైపు మాజీ మంత్రులఅరెస్టులతో టిడిపిని బెంబేలెత్తిస్తున్న వైసిపి ఇంకోవైపు ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ తెరదీసిందని సమాచారం.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతినాడే అంటే బుధవారం పలువురు టిడిపి నేతలు వైసీపీలో చేరబోతున్నారని ఆ పార్టీ ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఇప్పటికే కొందరు టిడిపి నేతలు వైసీపీలో చేరడం తెలిసిందే . ఇటీవల చేరికలు ఆగిపోవడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా ముహూర్తం ఖరారు అయిందన్న వార్తలు రావడంతో ఆయన అప్రమత్తమయినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. మద్దాలిగిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాంలు వైసీపీకి మద్దతు పలికారు. అధికారికంగా వీరు టీడీపీ సభ్యులైనప్పటికీ పార్టీలో లేనట్లే పరిగణనలోకి తీసుకోవాలి. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్న ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతుంది. ముఖ్యంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లు పార్టీని వీడతారని పెద్దయెత్తున రూమర్స్ వచ్చాయి. అయితే వీటిని ఇద్దరూ కొట్టి పారేశారు.
కాగా తాజాగా శాసనమండలిలో ఎమ్మెల్సీలపై వైసీపీ కన్ను పడిందంటున్నారు. ఎమ్మెల్సీలను త్వరగా పార్టీలో చేర్చుకోవాలన్నది జగన్ నిర్ణయంగా ఉంది. ఇప్పటికే పోతుల సునీత, శమంతకమణి, డొక్కా మాణిక్య వరప్రసాద్ లు టీడీపీ ని వీడి వైసీపీలో చేరారు. అయితే డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేయడంతో తిరిగి ఎన్నిక జరిగింది. జగన్ మళ్లీ ఆయననే అభ్యర్థిగా ఎంపిక చేసి ఎమ్మెల్సీని చేశారు. ఈపంపింది.వైసీపీలో కొస్తే మళ్లీ ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉంటుందని టిడిపి ఎమ్మెల్సీలకుబలమైన సంకేతాలను వైసీపీ అధినాయకత్వం పంపింది .
దీంతో జులై 8వతేదీన మరో ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీలో చేరతారన్న ప్రచారం అయితే అమరావతిలో జోరుగా సాగుతోంది. వీరితో పాటు మరికొందరు నేతల పేర్లు కూడా రెడీ చేశారట. ఇదే పనిలో కొందరు మంత్రులు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి నేతలు పార్టీ మారతారని సమాచారం. మొత్తం మీద జులై 8వ తేదీన ఎవరెవరు పార్టీ వీడతారన్న టెన్షన్ టిడిపి అధినేత చంద్రబాబును పట్టుకుంది.పార్టీని ఎలా పట్టుకురావాలి నేతలను ఎలా కాపాడుకోవాలి అన్నదే ఇప్పుడు చంద్రబాబు ముందున్న ప్రధాన సమస్య.సంక్షోభాలను సంక్షోభాల నుంచి అవకాశాలు వెతుక్కుంటానని తరచూ చెప్పే చంద్రబాబు ఇప్పుడేం చేస్తారో చూద్దాం!