విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఒక్కసారిగా కేసరిలా మారిపోయారు! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అయితే సమయం సందర్భం లేకుండా ఆ ఎంపీ గారు సీఎం ను టార్గెట్ చేయటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకు ఆయనకు జగన్ మీద అంత కోపం వచ్చింది అన్నది ప్రధాన ప్రశ్న. నాని ఎంపీగా ఎన్నికై ఏడాది దాటాక కూడా ఇంతవరకు ఈ స్థాయిలో సీఎంను ఈ స్థాయిలో విమర్శించలేదు.ముఖ్యమంత్రిని నియంత హిట్లర్ తో కేశినేని నాని పోల్చారు. ఏకంగా ముఖ్యమంత్రి ని పట్టుకొని ఆయన దగాకోరు అనేశారు.
పచ్చి మోసకారి అని దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు 25 మందిని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాం అని జగన్ ప్రగల్భాలు పలికారని చెప్పారు.రాష్ట్ర ప్రజలు జగన్ మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు వైసిపికి 22 లోక్ సభ ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా మీద ముఖ్యమంత్రి ఇప్పుడు అసలు నోరు మెదపడం లేదని అన్నారు.కేసుల నుండి బయట పడటానికి జగన్ కేంద్రంతో లాలూచి పడ్డారని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని నాని అన్నారు.
టీడీపీ నేతలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆనాడు చంద్రబాబు మీద నమ్మకంతో రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని, ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. అయితే సీఎం పదవి జగన్కు పర్మినెంట్ కాదని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. హిట్లర్ వంటి వారే కాల గర్భంలో కలిశారని జగన్ అంతకంటే హీనమని అన్నారు. ప్రజలు తగిన సమయంలో బుద్ది చెబుతారని అన్నారు.కేసినేని వ్యాఖ్యలను విశ్లేషించిన రాజకీయ పరిశీలకులు త్వరలో విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రానున్న కేంద్ర మంత్రి గడ్కరీని, బిజెపి కేంద్ర నాయకత్వాన్ని ఆకట్టుకోవడానికి ఈ స్థాయిలో జగన్ ను తిట్టారంటున్నారు!
ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో కేసినేని పాత్ర ఎంతో ఉంది.అయితే ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సమయంలో ఆ క్రెడిటనంతా కొట్టేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.దీంతో కడుపు మండిన కేసినేని నాని ఈ తరహా విమర్శలు చేశారని పట్టుబట్టి గడ్కరీ ని ప్రారంభోత్సవానికి తీసుకోస్తున్న కేంద్ర మంత్రికి ఆయన ఈ విధంగా బ్రీఫ్ చేశారని చెబుతున్నారు.సీఎంను విమర్శించడం ద్వారా కేంద్ర బిజెపి నాయకత్వం ఆశీస్సులు కూడా అందుకునే ఎత్తుగడ చేశారంటున్నారు టిడిపిలో నుంచి బీజేపీలోకి వెళ్లిపోవడానికి దాదాపు కేశినేని నాని సిద్ధపడినట్టు కూడా ఒక టాక్ ఉండనే ఉంది.